Ramayapatnam: Port: రామాయపట్నం పోర్టు Ramayapatnam Port.. ఏపీ, కేంద్రం మధ్య సఖ్యతకు బీటలు వారుతున్నాయా..? పరిస్థితులు ఆ అవకాశం కల్పిస్తున్నాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన పోలవరం అంచనాలు.. ప్రెజెంట్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం.. వీటిపై కేంద్రం నిర్ణయాలతో ఏపీకి పెనం మీద కూర్చున్నట్టుంది. ఇవి చల్లారక ముందే ఇప్పుడు రామాయపట్నం పోర్టు రూపంలో ఏకంగా పొయ్యిలో పడుతున్నట్టుగా ఉంది ఏపీ ప్రభుత్వ పరిస్థితి. రామాయపట్నాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్ కు షాక్ ఇచ్చేలా.. అది మేజర్ పోర్ట్ కాదని.. స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు కోసం రామాయపట్నం పోర్టును బీజేపీ కావాలనే బలి చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో టీడీపీ హయంలో కృష్నపట్నం పోర్టుకు సహాయ సహకారాలు ఉండేవి. నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో పోర్టు అభివృద్ధి చెందింది. ప్రభుత్వం మారి వైసీపీ చేతుల్లోకి వచ్చాక ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేలా జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోర్టు అభివృద్ధికి కృషి చేసింది. కేంద్రం కూడ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమంటూ రామాయపట్నం పోర్టు అభివృద్ధికే సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే.. నవయుగ కంపెనీ కృష్ణపట్నం పోర్టు అభివృద్ధిలో గుజరాత్ కు చెందిన అదానీ కంపెనీ భాగస్వామ్యం అయ్యేలా ఒప్పందం చేసుకుంది. ఇదే ఇప్పుడు బీజేపీ నేతల ఆలోచన మారేలా చేసిందనే వార్తలు వస్తున్నాయి. విభజన చట్టం సాకుగా చూపి మేజర్ పోర్టు కాదనడంలో ఆంతర్యం ఏంటని వార్తలు వస్తున్నాయి.
బీజేపీ పెద్దలకు అదానీ గ్రూప్ తో సంబంధాలున్నట్టు ఇప్పటికీ వార్తలు వస్తూంటాయి. ఈ నేపథ్యంలోనే రామాయపట్నం పోర్టును కాదని కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసమే కేంద్రం ఈ ప్రకటన చేసిందని తెలుస్తోంది. టీడీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టును కేంద్రం వ్యతిరేకించింది. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. రామాయపట్నం పోర్టు అభివృద్ధి చెందితే కృష్ణపట్నం పోర్టుకు ఆదాయం తగ్గిపోతుంది. అన్ని అనుకూలతలు రామాయపట్నంకు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో వాటా ఉన్న అదానీకి నష్టం చేకూర్చడం ఇష్టం లేకే కేంద్రం రామాయపట్నం పోర్టును పక్కన పెట్టేస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రం-కేంద్రం మధ్యలో మరో యుద్ధం తప్పేలా లేదు..!