దుబ్బాక ఉప ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బీజేపీ భారీ కుట్రకు తెరలేపుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదులో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి తమకు సమాచారం అందిందన్నారు. బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారనీ అవేమీ ఫలించకపోవడంతో ఇప్పుడు కుట్రలకు తెరలేపుతోందనీ దీనికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు కేటిఆర్. దుబ్బాక నియోజకవర్గంలో డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి సాక్షాలు కనబడుతున్నాయన్నారు. మొన్న ఎనిమిది మంది బీజేపీ నాయకుల ఇళ్లలో పెద్ద మొత్తం నగదు పట్టుబడగా నేడు మరో కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడ్డారని చెప్పారు.