గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సందడి మొదలైంది. ఒక పార్టీ తర్వాత మరో పార్టీ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ , కాంగ్రెస్ , ఎంఐఎం లు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి.
అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీపై ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోందని అంటున్నారు. టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ దృష్టి పెట్టింది. కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడే నేతలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది.
గ్రేటర్లో ఎన్నికల సందడి
వచ్చే ఏడాది జనవరి రెండో వారంలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పై బీజేపీ నజర్ పెట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్లో ఒక్కో డివిజన్ నుంచి సగటున 5 మంది ఆశావాహులు ఉన్నారు. టికెట్ దక్కని మిగతా నలుగురిని పార్టీలోకి చేర్చుకునే వ్యూహంలో బీజేపీ నేతలు ఉన్నారు.
బీజేపీ కొత్త గేమ్ …
కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు లోకల్ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయి. వారంతా బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. శుక్రవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజవర్గానికి చెందిన మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరారు. ఇదే బాటలో అంబర్పేట, ఉప్పల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీని బలహీన పరిచేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా.. టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలపై బీజేపీ గురిపెట్టడం రాజకీయ ఎత్తుగడలకు నిదర్శనమని చర్చించుకుంటున్నారు.