అమరావతి : కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేక భాస్కర్ రావు సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. భాస్కర్ రావు మునిసిపల్ చేపల మార్కెట్ లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారు అయ్యారు. తీవ్రంగా గాయపడిన భాస్కరరావును జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్ రావు సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి ముఖ్య అనుచరుడు. భాస్కర్ రావు మృతి వార్త తెలియగానే వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తంగా మారింది. అక్కడ పోలీసులను భారీగా మోహరించారు.
ఈ ఘటనతో మచిలీపట్నం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.హత్య చేసిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పలువురు భాస్కర రావు అనుచరులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి మీదకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు. భాస్కరరావు హత్యలో ఇద్దరు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాకులు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్చందంగా మూసివేశారు.
ఈ హత్య పాత కక్షల కారణంగా జరిగిందా, ఇంకా ఏమైనా రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయా తదితర అంశాలతో పాటు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.