ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ పీడ ఎప్పుడు వదిలిపోతుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. దేశంలో కరోనా తీవ్రత మరీ ఎక్కువైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈనేపథ్యంలో కరోనా సోకిన ఓ వ్యక్తి మరణం ఆ కుటుంబ సభ్యులను తీవ్రమైన మనోవేదకు గురి చేసింది. కరోనాను జయించిన ఆ కుటుంబ పెద్దను విధి మరో రూపంలో బలి తీసుకుంది.
యాచారం మండలానికి చెందిన ఓ 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. చికిత్సకు ఆయన కోలుకున్నారు. డాక్టర్లు డిశ్చార్జి కావొచ్చని చెప్పారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. తెల్లవారితే కుటుంబ పెద్ద ఇంటికి వస్తారని భావించిన వారికి ఓ విషాద వార్త వచ్చింది. ఆ వ్యక్తి రాత్రి గుండెపోటుతో మరణించారనే వార్త ఆ కుటుంబసభ్యులకు శరాఘాతంగా తగిలింది. తెల్లారితే హాయిగా ఇంటికి రావాల్సిన వ్యక్తి ఇక రాడని తెలిసి వారంతా ఆవేదనకు గురయ్యారు. తమతో ముందురోజు సంతోషంగా మాట్లాడిన తండ్రి రాలేకపోవడంతో ఆయన కుమారులు కన్నీరుమున్నీరవుతున్నారు.