సీతక్క… తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అడవి బాట పట్టిన ఆమె అనంతరం ప్రజా జీవితంలోకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో చేరవ అవుతున్నారు. ఇటీవల ఆమె ప్రజలకు చేరువ అవుతున్న తీరు ఎందరికో నచ్చింది.
అలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఆమె ఇప్పుడు జాతీయ రాజకీయ నేతల దృష్టిలో పడుతున్నారు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్కపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దీంతో, ఆమె రాజకీయ ప్రస్తానం చర్చనీయాంశంగా మారింది.
కరోనా సమయంలో సోషల్ మీడియాలో
కరోనా కష్టకాలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చేసి సాయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళ్లి.. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న అక్కడివారికి నిత్యావసరాలు అందించారు. కొన్నిచోట్ల ఆహారం కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్ గో’ చాలెంజ్ను ప్రారంభించారు. ఆ చాలెంజ్ను దాదాపు 60 రోజుల పాటు కొనసాగించారు.
ఎంత కష్టానికి ఓర్చారంటే….
కొద్ది దూరం బైక్పై, మరికొంత దూరం సరైన మార్గంలేని రాళ్లు, రప్పల్లో కాలినడకన ప్రయాణించారు. ఇలా 16 కి.మీ ప్రయాణించి ఆ ఊరికి చేరుకున్నారు. రోడ్డు కూడా సరిగా లేని మార్గంలో నిత్యావసరాలు మోసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. సీతక్క మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది, మీకు భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.. అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
వరద సమయంలో
వరద ముంపు బాధితులకు సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలిలో చేయూత అందించారు. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవలో వెళ్లిన ఎమ్మెల్యే.. స్వయంగా దుప్పట్లను తలపై పెట్టుకొని తీసుకెళ్లారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి, ఓడవాడ, ఆచార్య నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాలు ఇటీవల వరద ముంపునకు గురయ్యాయి. ఈ మేరకు రాబిన్ ఉడ్ ఆర్మీ బాధ్యులు రమ – దామోదర్ ఆధ్వర్యాన ఆయా ప్రాంతాల్లో బాధితులకు చీరలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీతక్క.. ఎలిశెట్టిపల్లికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్గం లేకపోవడంతో పడవపై జంపన్న వాగు దాటారు. అక్కడ దిగాక కొద్దిదూరం నడవాల్సి ఉండటంతో ఇతరులతో కలసి సీతక్క స్వయంగా దుప్పట్లను మోశారు. అనంతరం బాధితులకు సరుకులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్పై
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని ములుగు ఎమ్మెల్యే విమర్శించారు. 72వేల కోట్లతో పార్కులు, బాత్ రూమ్ లు మాత్రమే కట్టారన్నారు. ఈ డబ్బుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. మంచి నీళ్లు ఇవ్వడం లేదు కానీ… మద్యం మాత్రం డెలివరీ చేస్తున్నారన్న సీతక్క..ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరితే..కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు లేవని ఎగతాళి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసింది మీ పదవులు కోసమేనా అని ములుగు ఎమ్మెల్య సీతక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీతక్క దేశంలోనే ఇలాంటి ఎమ్మెల్యే ఆమె ఒక్కరే
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పార్టీ సోషల్ మీడియా టీంతో జరిగిన జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే సీతక్క చాలా కష్టపడుతున్నారని, ప్రతి పార్టీ ప్రోగ్రాం పాటిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటూ రాహుల్ గాంధీ కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో సీతక్క లాంటి ఎమ్మెల్యే ఉండడం గర్వకారణమని రాహుల్ గాంధీ ప్రశంసించారు.