Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. తొలుత ఎజంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులతో సహా 47 మంది అభ్యర్ధులు ఉన్నారు.
మొత్తం 298 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం రెండు వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందకు క్యూలైన్ లలో బారులు తీరారు.
కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి చండూరు మండలం ఇడికుడ లోని పోలింగ్ కేంద్రం 173లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధి కే ప్రభాకరరెడ్డిలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పరిశీలిస్తున్నారు.