Munugode Bypoll: ఇతర ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలు ఇంకా నియోజకవర్గంలో ఉన్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం రాత్రి చండూరు ఆర్ ఓ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. బీజేపీ నేతలపై పోలీసులు వివక్షత చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు డబ్బులను పంపిణీ చేయడమే కాక విపరీతంగా భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానికేతరులను బయటకు పంపే వరకూ ఆందోళన కొనసాగిస్తానని చెప్పారు. తొలుత ఏఆర్ఒ నుండి సరైన సమాధానం రాలేదని చండూరు పోలీసు స్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లారు. పోలీస్ స్టేషన్ వద్ద తన అనుచరులతో ఆందోళన చేశారు. స్థానికేతరులను మునుగోడు నుండి ఖాళీ చేయిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డి ఆందోళన విరమించారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత మునుగోడు బయలు దేరారు. పోలీసులు ఆయనను పలు చోట్ల అడ్డుకున్నప్పటికీ వారిని ప్రతిఘటించి మలక్ పేట, వనస్థలిపురం దాటుకుని ముందుకు రాగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ఆయన వాహనాలను నిలుపుదల చేశారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వివాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బండి సంజయ్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.