Breaking: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు పెద్ద సంఖ్యలో నర్సీపట్నంలోని ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయన ఇంటిలోకి ప్రవేశించిన సీఐడీ అధికారులు ముందుగా నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయన ఇంటి గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అంశంలో పోర్జరీ పత్రాలు కోర్టుకు సమర్పించారన్న అభియోగం ఆయనపై ఉంది. ఐపీసీ 464, 467, 471, 474, సెక్షన్ల కింద ఆయన పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలుస్తొంది.
అర్ధరాత్రి సమయంలో పోలీసులు అయ్యన్నపాత్రుడు నివాసంలోకి ప్రవేశించడంపై స్థానికులు ప్రతిఘటించారు. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందని అయ్యన్న సతీమణి పద్మావతి ఆరోపించారు. తన భర్త, కుమారుడికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. కనీసం దుస్తులు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తన భర్తను పోలీసులు తోసుకుంటూ తీసుకువెళ్లారని పద్మావతి ఆరోపించారు. మూడేళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని అమె ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు అరెస్టును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుడుని కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ఇంతకు ముందు అయ్యన్నపాత్రుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులపై ఆయన హైకోర్టు ను ఆశ్రయించి అరెస్టు నుండి మినహాయింపు పొందారు. ఇప్పుడు తాజా కేసులో ఆయనను సీఐడీ అరెస్టు చేసింది.