Neeraj Chopra: ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ లో ఇప్పటివరకూ ఒక్క భారతీయ ఆటగాడు కనీసం కాంస్యం ను కూడా గెలవలేదు. అటు మహిళల్లో కూడా ఫైనల్స్ వరకు వెళ్లి సత్తా చాటిన వారు లేరు. అయితే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా మాత్రం జావెలిన్ త్రో ఫైనల్స్ లో బంగారు పతకం సాధించి దేశం గర్వించే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
23 ఏళ్ల ఈ కుర్రాడు హర్యానాలోని పానిపట్ లో జన్మించాడు. నేషనల్ రికార్డు 88.06 మీటర్లు కూడా నీరజ్ చోప్రా పేరు మీదనే ఉండడం విశేషం. ఇక ఒలింపిక్స్ ఫైనల్స్ లో 87.5 మీటర్లు విసిరి తొలి మూడు రౌండ్లు లోనే భారత్ కి పతకం ఖరారు చేశాడు. అయితే మిగిలిన అథ్లెట్లు కూడా హోరాహోరీగా తలపడ్డారు. ఇక భారత్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
కానీ చివరి వరకు నీరజ్ తన ఆధిక్యతను నిలుపుకోవడం తో అథ్లెటిక్స్ లో తొలిసారి భారత్ కు పతకం అందించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఇక అథ్లెటిక్స్ లో భారత్కు వచ్చిన తొలి పతకం కూడా స్వర్ణం కావడంతో అభిమానులు మరింత సంబరాల్లో మునిగిపోయారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణ పతకం సాధించి తొలిసారి ఒక భారత క్రీడాకారుడు వ్యక్తిగతంగా స్వర్ణం సాధించిన రికార్డు సృష్టించాడు. పన్నెండేళ్ళ తర్వాత నీరజ్ చోప్రా మళ్లీ భారత్ కి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిపెట్టాడు.