గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఇందుకు అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఓ వైపు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే ప్రణాళికలు అమలు చేస్తూనే మరోవైపు రాజకీయంగా కేసీఆర్ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సినీ నటి విజయ శాంతి బీజేపీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది.
విజయశాంతి రీ ఎంట్రీ ?
సినీ నటీ విజయశాంతి రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. అనంతరం పార్టీతో విబేధించి కాంగ్రెస్ గూటికి చేరారు. గత కొద్దికాలంగా ఆమె బీజేపీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డితో ఆమె ఇటీవల భేటీ కాగా, అంతకుముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రెండుసార్లు సమావేశమయ్యారు. సంజయ్తో సమావేశానికి ముందే విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
అమిత్ షా లేదా జేపీ నడ్డా
విజయశాంతి చేరిక అంశం మీద బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె చేరిక త్వరలోనే ఉంటుందని అన్నారు. ఇక నవంబర్ 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో విజయశాంతి బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా, బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ఇదిలాఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తన విమర్శల్లో పదును పెంచారు విజయశాంతి. ఆమె బీజేపీలో చేరిన అనంతరం వాటి దాటిని మరింత కొనసాగించనున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.