జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో ఒకటైన విశాఖకు.. ప్రస్తుతం గుంటూరులో ఉన్న క్యాపిటల్ తరలింపునకు రంగం సిద్ధం అయిందంటూ వార్తలు వస్తున్నాయి! ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖకు తరలించేస్తున్నారంటూ టీడీపీ హడావిడి చేస్తుంది. ఈక్రమంలో రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వస్తున్న సమాచారం.. చెబుతున్న లాజిక్ లను బట్టి ఆలోచిస్తుంటే… “విశాఖకు జగన్ ఆఫీస్” అనే విషయంపై సందిగ్ధత నెలకొంది!
అసెంబ్లీలో పాసయ్యాయి కానీ మండలిలో పెండింగులో ఉన్నాయి సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు! ఈ విషయంలో రెండోసారి శాసనమండలిలో ఈ బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కానీ.. ఈ బిల్లులను మండలి ఆమోదించలేదూ.. తిరస్కరించలేదు! కానీ… ఇలా జరిగిన సమయంలో రాజ్యాంగం ప్రకారం నెలరోజుల తర్వాత ఆమోదం పొందినట్లే అవుతుందనే వాదనను తెరపైకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఈ లాజిక్ ను నమ్ముకున్న జగన్ సర్కార్… గవర్నర్ సంతకం తీసుకుని తరలించాలనే ఆలోచన చేస్తుందని అంటున్నారు!
అయితే ఇక్కడ టీడీపీ నుంచి వినిపిస్తున్న లాజిక్ కూడా క్లిష్టంగానే ఉంది. వారు చెబుతున్న వివరాల ప్రకారం… మొదటిసారి పెట్టిన బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపినా కూడా మండలి కార్యదర్శి వాటిని తొక్కి పెట్టారని, మండలి చైర్మన్ ఆదేశాలను అమలు చేయడం లేదని కోర్టును ముందుగా హైకోర్టును ఆశ్రయించారు దీపక్ రెడ్డి. అయితే అక్కడ ఆలస్యం అవుతుండటంతో… సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ టీడీపీ ఎమ్మెల్సీ!
మరి ఈ విషయంలో చట్టపరమైన సమస్యలను గవర్నర్ సంతకంతో క్లియర్ చేయించుకుని.. మండలిలో ఎదురైన సమస్యను రాజ్యాంగంలోని రూల్స్ ప్రకారం క్లియర్ చేసుకుని విశాఖకు బయలుదేరతారా లేక సుప్రీంలో వేసిన పిటిషన్ ఫలితంగా ఆగిపోతారా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపు అనేఅంశం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి!