రాజాసింగ్…. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. ఆయన పేరు తెలియని బీజేపీ కార్యకర్త ఉండరు. కానీ, ప్రతీ విషయంలో ఆయనను పార్టీ అధిష్టానం పక్కనబెడుతూనే ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
తాజాగా మళ్లీ అదే అంశం తెరమీదకు వచ్చిందని అంటున్నారు. అయితే, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
రాజాసింగ్ టార్గెట్ చేశారా?
ప్రతీ విషయంపై స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే, ఆయనకు సొంత పార్టీలోనే షాకులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అధ్యక్ష పదవి నుండి తొలగించమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్ చేశారని వైరల్ అయింది. దీనిపై రాజాసింగ్ స్పందించారు. ఈ ప్రచారం అవాస్తవం అని రాజా సింగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. అయితే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ నన్ను మోసం చేశారు.
బండి సంజయ్ నన్ను మోసం చేసిన మాట వాస్తవం అని రాజాసింగ్ ఆరోపించారు. “ నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే జీహెచ్ఎంసీ ఎన్నికలో టికెట్ ఇవ్వాలని అడిగాను. మిగితా 150 డివిజన్ లలో ఎక్కడ అడగను అని చెప్పాను. కానీ ఇక్కడ నాయకులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. అందువల్ల నన్ను గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయాను“ అని తెలిపారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఆ కార్యక్రమాల్లో ఉన్నానని త్వరలో ప్రస్తుత పరిణామాలన్నీ వివరిస్తూ, కేంద్ర పార్టీ కి లేఖ రాస్తాను అని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.
ఆయనకు షాకులు తగలడం ఇదే మొదటిసారి కాదు
అయితే, రాజాసింగ్కు షాకులు ఎదురవడం ఇదే మొదటి సారి కాదని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన బండి సంజయ్ షాకిచ్చారు. కమిటీలో ఆయన అనుచరులకు పదవులు ఇవ్వలేదు. దీంతో అసలు రాష్ట్ర కమిటీ ఏర్పాటులో నా అభిప్రాయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి వాట్సాప్ మెసేజ్ పంపిన ఆయన.. రాష్ట్ర కమిటీ ఏర్పాటులో నా అభిప్రాయం తీసుకోలేదని.. నా నియోజకవర్గ నుండి కమిటీలో ఎవ్వరినీ తీసుకోలేదు… ఒక్కరు కూడా సమర్థులు లేరా? అంటూ ప్రశ్నించారు. బీజేపీలో మరో సారి నన్ను సైడ్ చేస్తున్నారని మెసేజ్లో పేర్కొన్న ఆయన.. మీ నాయకత్వంలో బీజేపీలో మార్పు వస్తుందని అనుకున్నా.. కానీ, కనిపించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీలో గ్రూపిజంని ఆపండి… కలిసి పని చేద్దాం అని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు .