(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లవద్దని ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపి ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన జి శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయగా గత నెల మూడవ తేదీన ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వు చేసింది. అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు సామర్థ్యం రెట్టింపు చేసినందున పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించింది. రాయలసీమ ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని ఏపి ప్రభుత్వం చేసిన వాదనను ఎన్జీటీ తిరస్కరించింది. తాగునీటి పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని ఎన్జీటీ గుర్తు చేస్తూ..ప్రాజెక్టు డీపిఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నది.