లాక్ డౌన్ ముందు వరకు ఈ ఓటీటీ- ఏటీటీ అంటే ఏంటో జనాలకి అంతగా అవగాహన లేదనే చెప్పాలి. ఎప్పుడైతే లాక్ డౌన్ అంటూ థియోటర్స్ మూతపడ్డాయో డిజిటల్ ప్లాట్ ఫాంస్ ..ఓటీటీ- ఏటీటీ అంటూ హడావుడి ఎక్కువైంది. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లాంటి వాళు చెలరేగిపోతున్నారు. నెలకో సినిమా తీసి సొంత ఏటీటీ లో రిలీజ్ చేసేస్తున్నారు. జనాలు సుఖంగా చూసేస్తున్నారు.
ఇక టాలీవుడ్ లో ‘మహానటి’ సినిమా తర్వాత చాలా మంది మేకర్స్ కి బయోపిక్స్ తీయాలన్న ఆసక్తి బాగా పెరిగిపోయింది. జనాల పల్స్ పట్టుకున్నారు. కమర్షియల్ సినిమాల కంటే బయోపిక్స్ తో జనాలని థియోటర్స్ కి రప్పించడం సులభమన్న విషయం అర్థం చేసుకున్నారు. అందుకే ఎన్టీఆర్ .. వైయస్సార్ లపై బయోపిక్ లు నిర్మించారు. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ కథను తెరపై చూపిన ఆర్జీవీ కొంత వరకు సక్సస్ అయ్యాడు. వివాదాస్పద జీవితకథలతో బయోపిక్ లు తీయడం ఆర్జీవీ కి బాగా అలవాటైన పని. ప్రస్తుతం ‘మర్డర్’ అన్న సినిమాని రూపొందిస్తున్నాడు. ఓటీటీ- ఏటీటీ కోసం సినిమాలు తీయడం వల్ల వీలైనంత తక్కువ బడ్జెట్ తో సినిమా కంప్లీట్ చేయోచ్చు. అందుకే ఆర్జీవీ లాగానే మిగతా మేకర్స్ రెడీ అయ్యారు.
ఇప్పటికే తమిళంలో జయలలిత జీవిత కథ మీద సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. అలాగే తెలుగులో దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ నటులు ఉదయ్ కిరణ్ బయోపిక్.. ఆర్తి అగర్వాల్ బయోపిక్ లపైనా ఇటీవల సినిమాలు రూపొందనున్నాయన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ బయోపిక్ ని తేజ తెరకెక్కించనున్నారని ప్రచారం జరిగింది. ఆర్జీవీ ‘హృదయ్ కిరణ్’ అనే టైటిల్ ని వర్మ ప్రకటించాడు. ఇంతకముందు ఒక బయోపిక్ తీయాలంటే ఎన్నో వివాదాలు, ఆంక్షలు ..ఇప్పుడు ఏటీఎం లా అయిన ఓటీటీ- ఏటీటీ లలో ఎలాంటి సినిమాలనైనా ఇట్టే తీసి రిలీజ్ చేస్తున్నారు.