panchayat raj : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలన్న సంకల్పంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు, వెల్పేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, సర్వేయర్, మహిళా పోలీస్, విఆర్ఓ తదితర పోస్టులతో పాటు వాలంటీర్లతో కలిపి దాదాపు 4 లక్షల మందిని విధుల్లోకి ప్రభుత్వం తీసుకున్నది. వీరంతా ఇప్పటి వరకూ పంచాయతీ రాజ్ శాఖ కింద విధులను నిర్వహిస్తున్నారు. వీరికి డ్రాయింగ్ డిస్ బర్స్ మెంట్ అఫీసర్ (డీడీఓ) గా పంచాయతీ కార్యదర్శులు (ఇఓ)లు వ్వహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అనేక రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రజలు మండల తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని తప్పింది.
అయితే ప్రభుత్వం తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి డీడీఓ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులను తొలగించి రెవెన్యూ శాఖ పరిధిలోని విఆర్ఓకు అప్పగిస్తూ జివో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పంచాయతీ రాజ్ ఉద్యోగులు తప్పుబడుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల మధ్య ఇది చిచ్చు రేపుతోంది. డీడీఓలుగా విఆర్ఓలను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పంచాయతీరాజ్ శాఖ బలహీనం కావడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దారి తప్పే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఏపి పంచాయతీ రాజ్ సర్వీస్ అసోసియేషన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తోంది. ఈ జివో రద్దు చేయాలని కోరుతూ పలు జిల్లాలలో పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం నేతలు ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలలో అయితే విఆర్ఓ, కార్యదర్శుల సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఘర్షణ కూడా పడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో మీరు అవినీతి పరులంటే..కాదు మీరే అవినీతి పరులు అంటూ విఆర్ఒ, గ్రామ కార్యదర్శులు ఒకరి నొకరు దూషించుకున్నారు. ఇప్పటికే విఆర్ఓ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయి ఉండగా వారికి డీడీఓ అధికారం ఇవ్వడం ఏమిటంటూ కార్యదర్శుల సంఘం నేతలు బహాటంగా విమర్శించారు. కార్యదర్శుల సంఘం నేతలపై విఆర్ఓల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులే అవినీతిపరులంటూ విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.