ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు తిరుపతి ఎస్సీ రిజర్వుడు లోక్సభ బిజెపి టిక్కెట్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది .ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు.
ముఖ్యంగా ఈరోజు శ్రీనివాసులు ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్టింగ్ అందరినీ ఆకర్షిస్తోంది.తిరుపతిలో బీజేపీని గెలిపిస్తే ఆ ఎంపీ కేంద్ర మంత్రి అవుతాడని దాసరి శ్రీనివాసులు పేర్కొన్నారు.వైసీపీని గెలిపిస్తే 21 మందికి ఇంకొకడు అదనంగా చేరతారని,అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అయి తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేగలుగుతాడని శ్రీనివాసులు ఆ పోస్టింగులో చెప్పారు.ఇది వినడానికి అతిశయోక్తిగా ఉన్నప్పటికీ దాసరి శ్రీనివాసులు వ్యూహాత్మకంగానే బిజెపికి అనుకూలించేలాగ ఈ ప్రచారం చేపట్టినట్టు కనిపిస్తోంది.సిట్టింగ్ వైసిపి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మరణంతో త్వరలో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటం తెలిసిందే.
ఇప్పటికే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఖరారయ్యారు.వైసిపి అభ్యర్థిగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పోటీ చేసే అవకాశాలు మెండు.వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో గురుమూర్తి ఆయన వెన్నంటే ఉండి ఫిజియోథెరపిస్టుగా సేవలందించిన నేపథ్యంలో ఆయనకు తిరుపతి లో పార్టీ టిక్కెట్టు ఇవ్వనున్నట్టు ఇప్పటికే లీకులు వచ్చేశాయి.అధినేత తలుచుకుంటే జరగనది ఏదీ ఉండదు కాబట్టి వైసిపి అభ్యర్థి గురుమూర్తి అనే రాసేసుకోవచ్చు.ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ ఇక్కడ పోటీ చేయాలని పట్టుదలగా ఉంది.తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి దగ్గరగా రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తన సత్తా చుాపడానికి తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకుంది.
అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా తిరుపతిని అడుగుతున్నప్పటికీ ఇప్పటికే ఈ సీటుపై బీజేపీ కర్చీఫ్ వేసేసినట్లు కనిపిస్తోంది.దీంతో తిరుపతిలోనే నివాసమేర్పరుచుకున్న దాసరి శ్రీనివాసులు రేసులో ముందుకు వచ్చేశారు.దళితులు,గిరిజనుల అభ్యున్నతికి దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ హోదాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి ఐఏఎస్ అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేయగా వారిలో ఉన్న దాసరి శ్రీనివాసులును అందరికన్నా ముందే విడుదల విడుదల చేశారు.ఆయన ట్రాక్ రికార్డు తెలుసుకున్న నక్సలైట్లు దాసరి శ్రీనివాసులుకు గౌరవమిచ్చి ముందే పంపేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. అభ్యర్థి పరంగా చూస్తే దాసరి శ్రీనివాసులు బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు.