రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వెంకట రామిరెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల వెంకట రామిరెడ్డి ఏపిలో న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని జడ శ్రవణ్ కుమార్ కోరారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి అలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగానికి, సర్వీసు నిబంధనలకు విరుద్దమని శ్రవణ్ కుమార్ అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయాల్సి ఉండగా, అలా చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు శ్రవణ్ కుమార్. వెంకట రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను న్యాయవాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలనీ, ఆ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ అని అన్నారు శ్రవణ్ కుమార్. ఇటీవల వెంకట రామిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే హైకోర్టు అడ్డుకుంటోందని, ఉద్యోగులు అందరూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.