ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో అపస్తృతి చోటుచేసుకుని 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ప్రధాన మంత్రి మోడీ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మరో పక్క కందుకూరులో తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 174 సెక్షన్ కింద కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కందుకూరులో రోడ్ షో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో కొందరు రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయారు. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికిపైగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో అయిదుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు పది లక్షలు వంతున ఆర్దిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. మృతుల అంత్యక్రియలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని ప్రకటించారు.