నగిరి నుండి “న్యూస్ ఆర్బిట్” గ్రౌండ్ రిపోర్ట్
ఫైర్ బ్రాండ్ లీడర్..! గట్స్ ఉన్న మహిళా నేత..! “జబర్దస్త్” నవ్వుల హీరోయిన్… నగిరి ఎమ్మెల్యే రోజా గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె అందరికీ తెలిసినా రోజానే. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం “రోజా” చెట్టుకి చుట్టూ ముళ్ళున్నాయి. ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొంతకాలంగా ఆమె జిల్లా కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం లేదు. ఎక్కువ సేపు హైదరాబాద్ లోనే ఉంటూ అప్పుడప్పుడు నగిరి నియోజకవర్గానికి వచ్చిన కుటుంబ సభ్యులతో గడిపి వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గాని, అభివృద్ధి కార్యక్రమంలో గాని, సమీక్షా సమావేశంలో ఆమె పాలు పంచుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో ఆమె కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై, జిల్లాస్థాయి సమావేశాల్లో పాల్గొనకపోవడం ఒక చర్చకు దారి తీస్తే.., జిల్లా మంత్రులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిలను పూర్తిగా కలవకుండా దూరం పాటించడం జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అయోమయానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా నగిరి నియోజకవర్గం నాయకులకు ముందు నుయ్యి వెనక గొయ్యి అనే తీరుగా ప్రస్తుత పరిస్థితి తయారయ్యింది.
ఎందుకీ ఎడమొఖం.. పెడమొఖం..!!
ఎన్నికల తర్వాత జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన రోజా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. తర్వాత జరిగిన కొన్ని సంఘటనాలు ఆమెలో మార్పునకు కారణాలుగా తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రమైన నగిరిలో జరిగిన పరిణామాలు జిల్లా ముఖ్య నాయకులకు ఆమెకు మరింత ఎడం పెంచాయి అంటున్నారు. నగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కే జి కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి మంత్రులు వెళ్లడం రోజాకు నచ్చలేదు.., కేజీ కుమార్ బహిరంగంగా రోజాని విమర్శించడంతో పాటు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు అందరికీ చెప్పడం… దాన్ని రోజా సోషల్ మీడియా వేదికగా తప్పు బట్టి కేజీ కుమార్ కి ఓ హెచ్చరిక జారీ చేయడం… ఈ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
తర్వాత నగిరిలో కుమార్ వర్గం, రోజా వర్గం అని రెండుగా విడిపోవడం ఆందోళన కలిగించే అంశాలు. వెంటనే స్పందించిన సీఎం జగన్ ఈ పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా మంత్రి పెద్దిరెడ్డిని ఆదేశించారు.. దీంతో పెద్ద రెడ్డి, నారాయణ స్వామిలు చొరవ తీసుకొని పాత పరిచయాలు కుమార్ ఇంటి శుభకార్యానికి వెళ్లి రావడం ఆయనకు సర్ది చెప్పడం జరిగింది. ఈ పరిణామం రోజాకు ఆగ్రహం తెప్పించింది. తన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు రోజా అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఆమె మనస్తాపం చెంది జిల్లా రాజకీయాలకు దూరమైనట్లు తెలుస్తోంది.
పార్టీ కోసమేనా..??
నగిరి నియోజకవర్గ రాజకీయాలు చూస్తే తమిళుల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది నగిరి నియోజకవర్గం తమిళనాడుకు పొంచి ఉండడంతో పాటు నగిరి పట్టణంలో దాదాపు 68 శాతం మంది తమిళ వాసులే. వీరిలో కే జి కుమార్ వర్గానికి మంచి పట్టుంది. రోజా భర్త సెల్వమణిపై అభిమానం ఉన్నా.., స్థానికంగా మాత్రం కేజీ కుమార్ కు వారితో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ కే జి కుమార్ ను దూరం చేసుకోవడం ద్వారా తమిళ ఓట్లు పోతాయని పెద్దిరెడ్డి, నారాయణస్వామి భావిస్తున్నారు. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీకి స్వల్ప మెజారిటీ వచ్చింది. మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం నగిరి లో వడమాలపేట మండలంలో రెడ్డిలు హవా ఎక్కువగా ఉంటే.., నగిరిలో తమిళుల హవా.., పుత్తూరులో రాజుల హవా.., నిండ్ర, విజయపురం మండలాల్లో ఎస్సీల ఓట్లు అధికం ఉన్నాయి. రోజాకు గత ఎన్నికల్లో వడమాలపేట మండలంలో అత్యధిక మెజార్టీ వచ్చింది. మిగిలిన మండలాల్లో ఆవిడ వెనకబడే ఉంది. రాష్ట్రంలో పార్టీ గాలి బలంగా ఉన్నప్పటికీ 2 వేల పైచిలుకు స్వల్ప మెజారిటీ తో నే బయటపడ్డారు. దీంతో నగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కంచుకోటగా ఉండాలంటే అందర్నీ కలుపుకుపోవాలని మంత్రులు జగన్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే జగన్ ఆమెతో కాస్త కటువుగా మాట్లాడినట్టు.., జిల్లా రాజకీయాల్లో దూరంగా ఉండాలని సూచించినట్లు వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలు చెబుతున్నారు. అయితే మంత్రులు ప్రతిదానిలోనూ ఆమెను దూరం చేసి రాజకీయం చేస్తున్నారంటూ రోజ వర్గం చెబుతోంది. ఇలా రోజా చెట్టుకి రాజకీయ ముళ్ళు గట్టిగానే ఉన్నాయి.