ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే ఫోన్స్ కాల్స్ చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వీడియో కాల్స్ చేస్తున్నాం. వీడియో కాల్స్ వల్ల ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం వల్ల వారు మన పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ వీడియో కాల్స్ కరోనా లాక్డౌన్ విధించించక మరీ ఎక్కువయ్యాయి.
ఒకరిని మరొకరు నేరుగా కలిసి మాట్లాడుకోలేకపోవడంతో వీటి వినియోగం మరింతగా పెరిగింది. వీటితో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్ కూడా పెరిగిపోయాయి. కానీ మీకు తెలుసా? పర్యావరణానికి వీడియో కాల్స్ వల్ల తీవ్రమైన నష్టం జరుగుతోందని? వీడియోలు హైక్వాలిటీలో చూడడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న విషయం ఇటీవల పరిశోధనలలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికి ఇదే నిజం!
ఆఫీస్ వెబ్ కాల్స్, లేదా కంపెనీ మీటింగ్ లలో పాల్గొనేవారు తమ కెమెరాను స్విచ్ఆఫ్ చేయడం వల్ల ఒక వ్యక్తి నుంచి విడుదలయ్యే కార్బన్ రేడియేషన్స్ ను 96 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన ను అమెరికాలోని పుర్డ్యూ యూనివర్సిటీకి (Purdue University) చెందిన నిపుణులు చేశారు. ఇలా పరిశోధించిన ఈ అధ్యయనం మొత్తాన్ని ‘రిసోర్సెస్, కన్జర్వేషన్ అండ్ రీసైక్లింగ్’ (Resources, Conservation and Recycling) జర్నల్లో ప్రచురించారు.
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ యాప్లను ఉపయోగించేటపుడు హై డెఫినెషన్లో కాకుండా దానిని స్టాండర్డ్ డెఫినెషన్లోకి మార్చుకుని కంటెంట్ను చూడటం వల్ల కూడా కార్బన్ రేడియేషన్స్ ను 86 శాతం వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాల సగటుతో పోలిస్తే అమెరికాలో ఇంటర్నెట్ డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి 9 శాతం ఎక్కువ కార్బన్ రేడియేషన్స్ విడుదలవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.