ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు.. తాడేపల్లిలో చర్చనీయాంశం అయినట్టు తెలిసింది. దీంతో ఆయనవ్యవహారాన్ని సీరియస్గానే తీసుకోవాలని.. కీలక నాయకులు ఆదేశించినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇటీవల ఓ నిండు సభలో జూపూడి మాట్టాడుతూ.. సాక్షిపేపర్పై విమర్శలు చేశారు. `సాక్షి పేపర్లో ప్రజలసొమ్ముతో ఇంత పెద్ద ప్రకటన ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందో పోతుందో తెలియదు. ఈ విషయాన్ని ఆలోచించండి` అని వ్యాఖ్యానించారు.
ఇది ఆయన ఏ యాంగిల్లో అన్నారో తెలియదు కానీ.. పార్టీలో మాత్రం హీటెక్కించింది. ఇక, తాజాగా మచిలీపట్నంలో మాట్లాడుతూ.. కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఎస్సీ సామాజిక వర్గం ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నజూపూడి దానికి పనికి వచ్చేలా.. పనిచేయాలి. కానీ, ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. పార్టీని డ్యామేజీ చేసేలా వ్యవహరించారని నేతలు అంటున్నారు.
`మాకు డబ్బులే ముఖ్యం. ఎస్సీల ఓట్లే ముఖ్యం. అంబేడ్కర్ తర్వాతే` అని జూపూడి అన్నారు. ఎందు కంటే.. విదేశీ విద్యాదీవెన పేరుతో ప్రభుత్వం విద్యార్థులకు సొమ్ములు ఇస్తోంది. అయితే.. ఈ పథకాన్ని జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్చారు. దీనిపైనే జూపూడి మాట్లాడుతూ.. ఎస్సీలకు ఏం కావాలి.. డబ్బులు. ఇదే కదా.. ప్రభుత్వం చేస్తోంది. అంబేడ్కర్ గురించి మాకెందుకు? ఆయన పేరు తీసేసేలా కూడా నిర్ణయాలు ఉండొచ్చు! అని అన్నారు. ఇది.. ఎస్సీసామాజిక వర్గం నేతల్లో ఆగ్రహానికి దారితీసింది.
దీంతో వైసీపీ ప్రభుత్వం విజయవాడలో నిర్మించిన నిలువెత్తు అంబేడ్కర్ విగ్రహం కూడా..జూపూడి వ్యాఖ్యలతో చిన్నబుచ్చుకునే పరిస్థితి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా జూపూడి ఎందుకు యూటర్న్ అయ్యారు. ఆయన ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చను పరిశీలిస్తే.. ఆయన వచ్చే ఎన్నికల్లో కొండపి లేదా.. తిరువూరు టికెట్లను ఆశించారు. కానీ, పార్టీ ఇవ్వలేదు. దీంతో ఇలా.. పార్టీలోనే ఉంటూ.. పార్టీకి సెగబెడుతున్నారనే చర్చ సాగుతోంది. వాస్తవానికి.. గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఉంటూ.. ఇలానే చేశారనిపరిశీలకులు గుర్తు చేస్తున్నారు.