సమష్టి కృషితోనే ముందడుగు వేశామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకున్న మోదీ ఈ రోజు ఈ ఏడాదికి చివరిసారిగా మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభ తర వాణిజ్యం)లో అద్భుత ర్యాంకింగ్ సాధించడానికి సమష్టి కృషే కారణమన్నారు. పేదరిక నిర్మూళనలో భారత్ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి వేగాన్ని ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయని చెప్పారు. సౌర విద్యుత్, వాతావరణ మార్పుల విషయంలో కూడా భారత్ ప్రగతిని ప్రపంచదేశాలు గుర్తించాయని పేర్కొన్నారు. 2018 లో మనం ‘ఆయుష్మాన్ భవ’ ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యబీమా కార్యక్రమాన్ని ప్రరంభించామని మోదీ చెప్పారు.
దేశ ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ పంటలు, వ్యవసాయం, రైతు, గ్రామాలకు సంబంధించిన గొప్ప పండుగ అని అభివర్ణించారు. ఈ సంక్రాంతి దేశ ప్రజలకు సుఖ సంతోషాలు, సంపద తీసుకురావాలని ఆకాంక్షించారు.