రష్యా – ఉక్రెయిన్ మధ్య గత పది నెలలుగా యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్దం కారణంగా ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవి చూస్తున్నాయి. రష్యా సైనిక దళాలతో చేస్తున్న దాడిని ఉక్రెయిన్ సమర్ధవంతంగానే తిప్పికొడుతూ వచ్చింది. రష్యా క్షిపణులతో ఉక్రెయిన్ రాజధాని తో సహా పలు నగరాలపై దాడి చేస్తూ ప్రాణ, ఆస్తినష్టాలను కల్గించింది. అమెరికా సహా పలు దేశాలు అందిస్తున్న సహకారంతో ఉక్రెయిన్ ఏ మాత్రం వెనుకకంజ వేయకుండా క్షిపణుల దాడిని ఎదుర్కొంటోంది. పది నెలలుగా యుద్దం చేస్తున్నా ఉక్రెయిన్ పై తను అనుకున్న ఆధిపత్యాన్ని రష్యా సాధించలేకపోయింది. మరో పక్క ప్రపంచ దేశాలు రష్యాని వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్దానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్దానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు తాజాగా పుతిన్ పేర్కొన్నారు. శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారి తీస్తుందని తాము ఇప్పటికే పలు మార్లు చెప్పినట్లు పుతిన్ గుర్తు చేశారు. అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒక రకమైన చర్చల ద్వారానో లేదా మరో విధంగా ముగుస్తాయని పుతిన్ చెప్పారు. తాము చర్చలకు సిద్దమని చెబుతున్నా ఉక్రెయిన్ మాత్రం సుముఖత చూపడం లేదని రష్యా పేర్కొంటోంది. రష్యా వాదన ఈ విధంగా ఉండగా, ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది.
చర్చలు జరగాలంటే ముందుగా దాడులను ఆపాలనీ, తమ నుండి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగించాలనీ, ఆ తర్వాతనే చర్చల ప్రక్రియకు సుగమం అవుతుందని ఉక్రెయిన్ చెబుతోంది. రెండు రోోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ సమావేశమైన సందర్భంలో ఉక్రెయిన్ పై తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పరిణామం తర్వాత రోజే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్దం ముగింపు ప్రతిపాదనపై మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కరోనా ఉదృతిపై ప్రధాని మోడీ సమీక్ష .. కీలక సూచనలు ఇవి