Raghu Veera Reddy : పి.సి.సి. అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి ప్రస్తుతం సాగిస్తున్న జీవితం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తోంది . మొన్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోపెడ్ మీద సామాన్యుడిలాగా ఓటు వేయడానికి వచ్చిన రఘువీరా రెడ్డి ఫోటో మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయింది .ఆ తర్వాతే ఆయన జీవన శైలిపై చర్చ మొదలైంది.
Raghu Veera Reddy : ఆ రోజుల్లో ఆయనో బ్రాండ్!
ఫక్తు కాంగ్రెసువాదియైన రఘువీరారెడ్డి తెలుగుదేశం పార్టీకి సింహస్వప్నంగా నిలిచారని చెప్పాలి.కాంగ్రెస్ నేతల్లో మంచి వాయిస్ ఉన్న నాయకుడు రఘువీరా రెడ్డి.అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఆడుకోవాలన్నా ఆయనకే చెల్లింది.అందుకే ఆయన దాదాపు అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా చేశారు. అయితే ఆయన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు.ఆయన క్యాబినెట్లో
రఘువీరారెడ్డి వ్యవసాయ మంత్రిగా పని చేస్తున్న రోజుల్లో మేఘమధనానికి సంబంధించిన వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. జగన్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో, కాంగ్రెస్ లోనే కొనసాగిన రఘువీరారెడ్డి మీద విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉంటూనే రఘవీరారెడ్డికి జగన్ కోవర్టులా మారారని రాజకీయవర్గాల్లో చర్చ సాగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ కాడె భుజాన వేసుకుని కొంత కాలం పాటు ఏటికి ఎదురీదే ప్రయత్నం చేశారు రఘవీరారెడ్డి. ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో కానీ కాడె కింద పడేసి తనకి ఈ అధ్యక్ష పదవి వద్దని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. తనకున్న రాజకీయ పరిచయాలతో అధికార వైసిపిలోనో, ప్రతిపక్ష తెలుగుదేశంలోనే కాకుంటే జనసేన, బిజెపి ల్లాంటి పార్టీలోనే చేరే అవకాశం లేకపోలేదు. కానీ, రఘవీరారెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన సొంత గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ మర్చిపోయిన మట్టి వాసనల్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మీడియా అడగడానికి ప్రయత్నించినా కూడా సున్నితంగా నవ్వేసి మాట దాటేశారే కానీ, కనీసం తన మనసులో మాట మాత్రం బయట పెట్టలేదు. తాను ఏదో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నానని రాజకీయ నాయకుడిగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు.
వైఎస్ ప్రేరణ తోనా!
రఘువీరా రాజకీయ మిత్రుడైన డాక్టర్ రాజశేఖరరెడ్డి కి కూడా దాదాపు అదే రకమైన ఆలోచనా విధానం ఉండేది. రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ వయసు ఉండాలని 60 ఏళ్ళు దాటిన వాళ్ళు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని వై.ఎస్. అనే వారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలి సారిగా జరిగిన శాసన సభ సమావేశాల సందర్భంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న కొంత మంది మీడియా మిత్రులు ఆ విషయాన్నే వై.ఎస్. దగ్గర ప్రస్తావించారు. దానికి వై.ఎస్. చెప్పిన సమాధానం..నిజమే 60 ఏళ్ళకు రిటైర్మెంట్ ఉండాలని చెప్పిన మాట నిజమేకానీ, ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు, మెరుగైన జీవన విధానం తో బహుశా ఆ లిమిట్ ఇప్పుడు కాస్త పెంచాలేమో అని..నవ్వుతూ చెప్పారు. కానీ, అనుకోకుండా ఆ సమావేశాలు ముగిసిన మర్నాడే రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ వై.ఎస్. ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఆయన శాశ్వతంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. బహుశా రఘవీరారెడ్డి మీద ఆనాడు జరిగిన ఘటనల ప్రభావం కూడా ఉండి ఉంటుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.అన్ని పార్టీల్లోని సీనియర్ రాజకీయ నేతలు రఘువీరారెడ్డి గురించే ఇప్పుడు చర్చించుకోవడం విశేషం.