ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు నెలలపాటు భక్తులకు దర్శన భాగ్యం లేకుండా అయిపోయిన పరిస్థితి. ఈ పరిష్తితుల్లో అనేక జాగ్రత్తల నడుమ పరిమిత సంఖ్యలో దర్శనాలను ప్రారంభించింది బోర్డు! ఈ క్రమంలో గతంలో చంద్రబాబు హయాంలో సంచలన కామెంట్లు చేసిన రమణ దీక్షితులు మరోసారి మైకందుకున్నారు.. దీంతో వ్యవహరం రమణదీక్షితులు వర్సెస్ సుబ్బారెడ్డి వరకూ వచ్చినంత పనైంది!
ఈ సమయంలో ఉన్న కష్టాలు చాలవన్నట్లుగా మీడియాకెక్కారు టిటిడి గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు. స్వామీ వారి సేవ చేసే అర్చకుల్లో 40 మందిలో, 16 మందికి కరోనా వచ్చిందని.. వెంటనే దర్శనాలు ఆపాలి అంటూ రమణ దీక్షితులు ట్వీట్ చేసారు. కేసులు పెరుగుతున్నా, ఈవో, ఏఈవో దర్శనాలు ఆపటం లేదని అన్నారు. ఇంకా 25 మంది రిపోర్ట్ లు రావాల్సి ఉందని అంటూ… ఈ పరిస్థితిలో దర్శనాలు కొనసాగించటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు.
అనంతరం ఈ విషయలపై టిటిడి చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.. రమణ దీక్షితుల వాదనను ఖండించారు. కీలకమైన హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని.. ఏమైనా ఉంటే బోర్డుకు సలహాలు ఇవ్వాలి కాని, ఇలా మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చెయ్యటం సరికాదని అన్నారు. ఇదే సమయంలో… తిరుమల దర్శనాల విషయంలో రాజకీయ రంగు పులమోద్దని.. అర్చకులకు ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు!