ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశ పడినట్లు వైజాగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసేందుకు చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా మండలి రద్దు బిల్లు పార్లమెంట్లో ఆగిన విషయం గూర్చి అయితే కాదు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజధాని వికేంద్రీకరణ బిల్లు మరియు సీఆర్డీఏ బిల్లును ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపించారు.
వీటిని గవర్నర్ పరిశీలించి.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు సమాచారం. సాధారణంగా రాష్ట్రం పరిధిలోని బిల్లులకు గవర్నర్ ఆమోదం సరిపోతుందని.. కానీ కేంద్ర చట్టాలతో ముడిపడిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సీఆర్డీఏ రద్దు.. 3రాజధానుల బిల్లుల్లోని కొన్ని అంశాలు కేంద్ర చట్టంతో ముడిపడి ఉన్నాయని, రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు.
అయితే కేంద్రంలో ఇటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతి పాత్ర ఎంత మాత్రం ఉంటుందో అందరికీ తెలిసిందే. కాబట్టి రెండు బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర ఉండాలి అంటే కచ్చితంగా మోడీ సపోర్టు ఉండాల్సిందే. లేకపోతే ఎక్కడలేని కారణాలు చూపించి దానిని కనీసం తాత్కాలికంగా అయినా నిలిపివేస్తారు. సో, వీలైనంత త్వరగా జగన్ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు మోడీని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మండల రద్దు పై ఆధారపడకుండా రాష్ట్ర గవర్నర్ కు బిల్లుని పంపి ఆమోదం తెచ్చుకుందామని అనుకున్న జగన్ కు చివరికి మోడీ రీతిలోనే పెద్ద గండం వచ్చిపడింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి నాయకులు జగన్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పైగా రాజధాని విషయంలో అతని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి మోడీ జగన్ తరఫున ఎంతమాత్రం ఆలోచిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.