ఇది నోట్ల కథ. రాళ్లు తయారు చేసిన కోట్లు… కోట్లు తయారు చేసిన నాయకులు… నాయకులు శాసించిన రాజకీయాల కథ. రాజకీయాలు మారినా ఎన్నటికీ రాళ్లే విజేతలుగా ఉన్నాయి. కథలో పాత్రలు మారొచ్చు, కానీ ప్రధాన సూత్రధారిగా ఉన్న రాయి మాత్రం మారదు. అదేంటో చుడండి, చదవండి…!
ప్రకాశం జిల్లాలో గ్రానైట్ నిక్షేపాల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కానీ సింపుల్ గా చెప్పాలి. 1996 వరకు అక్కడ ఇంత విలువైన రాళ్లు ఉన్నాయని తెలీదు. ఉన్నపళంగా అక్కడ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకుని అప్పటికి వ్యాపార ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్లి లీజుకి తీసుకుని తవ్వకాలు మొదలు పెట్టారు. ఐదేళ్లు తిరిగే సరికి కోట్లు వచ్చి చేరాయి. అలా నాడు లీజుకి తీసుకున్న వారు నేటికీ వదలకుండా ఏదో పేరుతో లీజులు కొనసాగిస్తున్నారు. అలా మొత్తం మీద చీమకుర్తిలో 2 వేల ఎకరాల్లో… బల్లికురవలో 700 ఎకరాల్లో క్వారీల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతుంటాయి. 1999 నాటికే కొందరికి బాగా నోట్లు, కోట్లు వచ్చి చేరడంతో నాటి రాజకీయాల్లో చేరారు. 2004 నాటికి బాగా చురుకయ్యారు. క్వారీయింగ్ చేసే ప్రతీ గ్రానైట్ వ్యాపారి ఏదో ఒక పార్టీ నీడన ఉంటూ రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడప్పుడూ తనిఖీలు, దాడులు జరిగేవి, రొటీన్ ప్రాసెస్ లో భాగంగా చెల్లింపులు ఇచ్చుకుని మళ్ళీ అంతా సాధారణ స్థితికి వచ్చేది. కానీ…!!
జ”గన్” గట్టిగా పేలింది…!
2019 లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపపు చిట్టాను బయటకు తీసి ఫైన్ వేశారు. “ప్రతి క్వారీ లీజులు, లెక్కలు, పత్రాలు, కొలతలు, అమ్మకాలు, పన్నులు” అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రూ. 1914 కోట్లు ఫైన్ వేశారు. ఇది రాజకీయ కోణంలో జరిగినా, ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఉల్లంఘనలు ఉల్లంఘనలే. వీటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు ఆయా కంపెనీలు రకరకాల ఎత్తులు వేస్తూ వచ్చాయి. వీటిలో కనీసం సగానికి పైగా వారి తప్పిదాలు ఉండగా, కొన్ని అంతర ఉద్దేశాలు ఉన్నాయి. ఒక్కో క్వారీ వారు ప్రస్తుతం వారికి వేసిన ఫైన్ నుండి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ వీరికి ఫైన్లు మాఫీ కాలేదు. కానీ కొందరికి దొడ్డిదారిన పెర్మిట్లు మాత్రం వచ్చేసాయి.
శిద్దాకి సులువుగా…!
శిద్ధా రాఘవరావు. గ్రానైట్ లో బాగా ఆరితేరిన పేరు. ఈయనతో పాటూ ఈ కుటుంబం, బంధు వర్గం అంతా గ్రానైట్ రాళ్ల తవ్వకాలతో రాజకీయాలు, జిల్లాలోనే కొన్ని వర్గాలను, ప్రాంతాలను శాసిస్తున్నారు. ఈ కుటుంబానికి రూ. 1000 కోట్ల వరకు ఫైన్ పడింది. దశల వారీగా అందరూ జగన్ పంచన చేరిపోయారు. మంత్రి చేసిందన్న కృతజ్ఞత కూడా లేకుండా శిద్దా కూడా జగన్ కి జై కొట్టారు. ఇలా జగన్ పార్టీలో చేరిన రెండో రోజు నుండి ఈ క్వారీలకు అనుమతులు వచ్చేసాయి. మొత్తం 43 క్వారీలకు గాను, ప్రస్తుతం 28 క్వారీల్లో బాగా తవ్వకాలు, రవాణా జరుగుతుంది. దీనిలో శిద్దా వాళ్లకు చెందిన క్వారీలు అన్నీ ఉన్నాయి. మిగిలినవి పెర్ల్ (దీన్ని వైసిపి ముఖ్య నాయకుడు ఒకరు వాటా లీజ్ తీసుకున్నారు), ఆనంద్ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి వైసిపి ఆశీస్సులతో రాళ్లు తవాక్యాలు, వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ క్వారీలకు వేసిన ఫైన్ అలాగే ఉంది. మాఫీ కాలేదు. కానీ అనుమతులు మాత్రం వచ్చేసాయి. అయితే జగన్ కి జై కొట్టని.., వైసిపిలో చేరని కొందరు నాయకులవి మాత్రం…!
పొమ్మనలేక… పొగ పెడుతున్నట్టు…!
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకు బల్లికురవలో క్వారీలున్నాయి. రవికుమార్ సంస్థలకు రూ. 285 కోట్లు.., రామారావు కి చెందిన సంస్థలకు 180 కోట్లు ఫైన్ వేశారు. వీళ్ళిద్దరూ వైసిపిలో చేరలేదు. వీరి క్వారీల్లో తవ్వకాలు జరగడం లేదు. వైసిపిలో చేరడం లేదు, తవ్వకాలు జరగడం లేదు. ఆ పక్కనే ఉన్న కేవీ (చీరాల ఎమ్మెల్యే కారణం బలరాం కి చెందినవి) లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య పాయింట్లు…!
* ఫైన్ లు ఎవరికీ మాఫీ చేయలేదు. కానీ అధికారం అండతో అధికార పార్టీలో చేరిన వారి వ్యాపారం, తవ్వకాలు సజావుగానే సాగుతున్నాయి.
* అధికార పార్టీలో చేరని వారి క్వారీల్లో తవ్వకాలు జరగడం లేదు. ఒకవేళ జరిపినా వెంటనే అధికారులు చేరుకొని నోటీసులు ఇస్తున్నారు. ఆగలేక, కక్కుర్తితో ఒక్క పూత తవ్వకాలు జరుపుతున్నా… వెంటనే పర్యావరణ, మైనింగ్ అధికారులు చేరుకొని కొత్త ఫైన్లు వేస్తున్నారు. ఇది తలనొప్పిగా మారింది.
* ఇప్పుడు అందరివీ ఒకేసారి మాఫీ చేయాలి. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్వారీయింగ్ చేసే నాయకుల్లో ప్రస్తుతం 80 శాతం మంది వైసిపిలోకి వెళ్లారు. మిగిలిన వారికి జగన్ నుండి ఆమోదం రావడం లేదు. అదీ వచ్చేస్తే ఏదోటి మాట్లాడి ఫైనల్ చేసే వీలుంది.
* లేకపోతే అందరికి ఒకటే చట్టం, ఒకటే న్యాయం వర్తిస్తుంది. వైసిపిలో చేరిన వారి ఫైన్ లు మాఫీ చేసినా, తగ్గించినా… టిడిపిలో ఉన్న వ్యాపారాలు కోర్టుకి వెళ్లి తమకు మాఫీ చేయాలని కోరే వీలుంది.
* అందుకే తాత్కాలికంగా అధికారం అండతో కొందరు రాళ్లు తవ్వుకుంటూ రాజకీయం చేస్తుండగా, కొందరు రాజకీయం దెబ్బలో రాళ్ళ మధ్యలో నలిగిపోతున్నారు.