నిత్యం తన మాటలతో, తన చేష్టలతో, తనదైన దూకుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే రేవంత్ రెడ్డి… ఈ సారి ఏకంగా కేసీఆర్ కేబినెట్ నే టార్గెట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కేబినెట్ ను అల్లకల్లోలం చేసే మాటలు మాట్లాడారు. అయితే… రేవంత్ రెడ్డి అన్న మాటలను కేవలం రాజకీయ విమర్శలగానో లేక కేసీఆర్ పై ఉన్న కోపం తోనో చేసిన కామెంట్లుగానే చూడకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో చాలా అర్ధమే దాగుందనేది వారి అభిప్రాయం!
వివరాళ్లోకి వెళ్తే… కరోనా పేరుచెప్పి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విషయంలో కేసీఆర్ అసమర్ధతకు, చేసిన తప్పులకు… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బలిపశువును చేయబోతున్నారని రేవంత్ బాంబు పేల్చారు. దీంతో మరోసారి ఈటెలకు నిద్రలేని పరిస్థితి నెలకొందట. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి కావడంతో ఈటల ఆ హోదా పరపతి అనుభవించాడు. అయితే రెండోసారి గద్దెనెక్కాక ఈటలను కాస్త దురదృష్టం వెంటాడుతోందనే అనాలి. కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. ఈటలను అసలు మంత్రివర్గంలోకే తీసుకోరని చర్చ జరగడం తెలిసిందే.
ఈ క్రమంలో ఈటల లీకులు ఇస్తున్నాడని, సరిగ్గా పనిచేయడం లేదని టీఆర్ ఎస్ అనుకూల పత్రికలో కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఆయనను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం సాగింది. దంతో… కేసీఆర్ సరైన సమయం కోసం చూస్తున్నారని అంతా భావించారు! ఆ మాటలకు బలంం చేకూర్చేల ఈటల హయాంలోనే డెంగ్యూ – చికెన్ గున్యా ప్రబలి చాలా మంది మరణాలు సంభవించాయి. దీంతో… ఈటల అసమర్థత అంటూ ప్రచారం జరిగింది. అనంతరం తెలంగాణ లో ఈఎస్ఐ కుంభకోణం, మందుల కొనుగోళ్లలో అవకతవకల వ్యవహారం రావడంతో ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ కూడా సాగింది.
ఈ దెబ్బలు చాలవన్నట్లు తాజగా కరోనా రూపంలో ఈటలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో దీనికి బాధ్యుడిని చేసి ఈటల మంత్రి పదవిని తీసేయబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… వాటికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు మరింత బలాన్ని పెంచాయి! చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మద్దతుగా తాజాగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను కరోనా వైఫల్యం పేరుచెప్పి పీకేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో… కేసీఆర్ కేబినెట్ లోనే రేవంతి చిచ్చుపెట్టినట్లు అయ్యిందని అంటున్నారు.