ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో తమ బ్యాంకులో పలు రుణాలను తీసుకునే వారికి ప్రాసెసింగ్ చార్జిలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే లోన్లపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు కూడా తెలిపింది. యోనో యాప్ ద్వారా రుణాలను తీసుకుంటే వడ్డీలపై ఇంకాస్త రాయితీని ఎక్కువగా అందిస్తామని తెలియజేసింది.
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కార్, గోల్డ్, పర్సనల్ లోన్స్ తీసుకుంటే 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తామని ఎస్బీఐ తెలియజేసింది. అలాగే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో ఇళ్లను కొనేందుకు ఎవరైనా రుణం తీసుకుంటే దానిపై కూడా 100 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదని తెలిపింది. ఇక క్రెడిట్ స్కోర్, తీసుకునే లోన్ మొత్తాన్ని బట్టి మరో 10 బేసిస్ పాయింట్ల మేర లోన్ల వడ్డీలపై డిస్కౌంట్లను కూడా అందిస్తామని తెలిపింది.
ఇక యోనో యాప్ ద్వారా ఆయా లోన్స్ ను తీసుకుంటే అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీపై డిస్కౌంట్ ఉంటుందని పేర్కొంది. అలాగే కార్ లోన్లను 7.5 శాతం వడ్డీకి అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు ఎంపిక చేసిన కార్లపై 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపింది. గోల్డ్ లోన్స్పై 7.5 శాతం వరకు, పర్సనల్ లోన్స్పై 9.6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలియజేసింది. పండుగ సమయంలో ప్రజలకు ఈ లోన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్బీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక యోనో యాప్ ద్వారా పేపర్లెస్ లోన్లను పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.