Kottagudem (Bhadradri Kottagudem): కన్న తల్లిని నిర్లక్ష్యం చేసి ఆమె మరణానికి కారకులైన నలుగురు కుమారులకు సంచలన తీర్పు వెళ్లడించారు కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జి భానుమతి. విచారణ సమయంలోనే ఒక కుమారుడు మృతి చెందగా మిగిలిన నలుగురు కుమారులకు జైలు, జరిమానా శిక్ష విధించారు న్యాయమూర్తి. వివరాల్లోకి వెళితే.. మొండికుంట గ్రామానికి చెందిన కందిమల్ల సరోజనమ్మకు అయిదుగురు కుమారులు. కుమారులు కందిమల్ల సుధాకర్ రెడ్డి, కందిమల్ల అశోక్ రెడ్డి, కందిమల్ల కృష్ణారెడ్డి, కందిమల్ల వెంకటరెడ్డి, కందిమల్ల శేఖర్ రెడ్డి లు వృద్ధాప్యంలో ఆమె బాగోగులు పట్టించుకోలేదు.
ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడం, పోషించాల్సిన కుమారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె 2016 ఆగస్టు పదవ తేదీన మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కుమారుల తీరును నిరసిస్తూ దీక్షకు కూర్చుంది. మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమె స్పృహతప్పిపడిపోవడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతురాలి మరణంపై పంచాయతీ అధికారుల ఫిర్యాదు మేరకు 2016 ఆగస్టు 12న నాటి ఎస్ఐ పి సంతోష్ మృతురాలి అయిదుగురు కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు అనంతరము కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. కోర్టులో కేసు విచారణ మధ్యలోనే ఆమె రెండవ కుమారుడు కందిమల్ల అశోక్ రెడ్డి చనిపోయాడు. ఈ కేసులో 16 మంది సాక్షులను కోర్టు విచారించింది. ప్రాసిక్యూషన్ వారు నిందితులపై నేరం రుజువు చేయడంతో మృతురాలి కుమారుల్లో ఒకరు మృతి చెందినందున మిగిలిన నలుగురికి ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష, రూ.5వేల వంతున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.