వచ్చే ఎన్నికల్లో పార్టీని పుంజుకునేలా చేయాలని.. కనీసం ప్రతిపక్ష హోదా అయినా.. దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీసీసీ పగ్గాలను దివంగత వైఎస్ కుమార్తె షర్మిలకు అప్పగించింది. దీంతో పెద్ద బూమ్ వస్తుందని కూడా ఆశించింది. నిజంగానే ఆమె పార్టీ పగ్గాలు చేపట్టి వచ్చిన తొలి రెండు వారాలు కూడా.. ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది. కానీ, ఎప్పుడైతే.. యూటర్న్ తీసుకుని వ్యక్తిగత వ్యవహారాలు ప్రారంభించిందో అప్పుడు గ్రాఫ్ తగ్గిపోయింది.
పైగా.. అప్పటి వరకు ఓ వర్గం మీడియా షర్మిలకు.. కవరేజి ఇచ్చినా.. చంద్రబాబును కూడా విమర్శించ డం ప్రారంభించాక.. ఈ మీడియా కూడా.. ఫోకస్ తగ్గించేసింది. దీంతో ఈ ప్రభావం షర్మిల ప్రచారంపై బాగానే పడింది. ఇదిలావుంటే.. ఇప్పుడు షర్మిల వెంట నడుస్తానని చెప్పి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఆ పార్టీ లోకి వెళ్లినంత వేగంగా.. వెనక్కి వచ్చేశారు.
నిజానికి ఈవిషయం షర్మిలకు కూడా.. చెప్పి ఉండకపోవచ్చు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆర్కే ఒక రాజకీ య తుఫానే సృష్టించినట్టు అయింది. అసలు ఆళ్లను పార్టీలోకి తీసుకున్నాక.. ఆయనను చూపించి.. కీల కమైన.. రెడ్డినేతలను తిరిగి పార్టీలోకి రప్పించుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఈ వ్యూహం ఇంకా పట్టాలు ఎక్కక ముందే.. ఆర్కే బయటకు వచ్చారు. ఇక్కడ ఆయన సైలెంట్గా కూడా లేరు. సీఎం జగన్ను అకారణంగా తిట్టాలని తనను ఒత్తిడి చేస్తున్నారని.. అందుకే బయటకు వచ్చానని అన్నారు.
ఈ వాదన బలంగా బయటకు వచ్చింది. దీంతో షర్మిల వ్యవహారంపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఆమె ముందు పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు.. కాంగ్రెస్ను బలోపేతం చేస్తానని చెప్పుకొంది. కానీ, తర్వాత.. వ్యూహం మార్చి.. జగన్ను టార్గెట్ చేయడం, వ్యాపార భాగస్వామ్యాలు ప్రజల మధ్య చర్చకు పెట్టడం తెలిసిందే. అంటే.. పార్టీ కన్నా.. కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న వాదన నెమ్మదిగా బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఆర్కే బయటకు రావడం.. ఆమెకు కూడా కనీసం చెప్పకపోవడం వంటివి.. ప్రధాన సమస్యలుగా మారాయి. ఇక, షర్మిలను నమ్మి.. రెడ్డి సామాజిక వర్గం ఎవరూ.. ఆమె వెంట నడిచేపరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.