ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని తెలుస్తోంది. టీడీపీ సీనియర్లు అత్యంత విశ్వసనీయంగా చెబుతున్న విషయం గురించి ఆరా తీసినప్పుడు.. నారా లోకేష్ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచిపోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ నారా లోకేష్ను ఓడించి తీరాలన్న కసితో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
నారా లోకేష్.. అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు! మరోసారి సీఎం జగన్ తేల్చి చెప్పిన దరిమిలా.. ఈ బాధ్యను వైసీపీ కీలక నాయకుడు ఆర్కే కూడా.. భుజాన వేసుకున్నారు. అసలు పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆయనను వెనక్కి తీసుకురావడం, మంత్రి పదవిని ఆఫర్ చేయడం.. వెనుక నారా లోకేష్ టార్గెట్ ఉందనే చర్చ వైసీపీ లో కంటే టీడీపీలోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి భేషజాలకు తావివ్వకుండా.. టీడీపీ వ్యూహం మార్చుకుంది.
ఈ క్రమంలో నారా లోకేష్ను అసెంబ్లీకి పంపించి తీరాలని అంతే కసిగా పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు శాసన మండలిలో నారా లోకేష్ ఉండడంతో అనేక విషయాల్లో ఆయన అధికార పార్టీకి చుక్కలు చూపించారు. మంత్రులతో నేరుగా ఢీ అంటే డీ అనేలా వ్యవహరించారు. మూడు రాజధానుల విషయంలో మండలిలో చర్చ జరిగినప్పుడు.. ఎదురు దాడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
బలమైన గళం.. ఎదిరించే తత్వం ఉన్న నారా లోకేష్ను అసెంబ్లీకి పంపించి తీరాలని చంద్రబాబు భవిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం మంగళగిరిపైనే ఆశలు పెట్టుకుంటే కష్టమని భావిస్తున్న నేపథ్యంలో తాజాగా గేర్ మార్చి.. అనంతపురం జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనేది పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి నారా లోకేష్ను నిలబెట్టడం ద్వారా. చివరి నిముషంలో వైసీపీకి షాక్ ఇవ్వడంతోపాటు.. ఎట్టి పరిస్థితిలోనూ ఒకటి కాకపోతే.. మరో చోట నుంచైనా. నారా లోకేష్ను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.