ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి షాకుల పరంపర కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం సమీక్ష చేస్తాను అని చెప్పటం, ఈ నిర్ణయం కోర్టు మెట్లు ఎక్కడం తెలిసిన సంగతే.
దాదాపుగా 40కి పైగా కంపెనీలు హైకోర్టుకు వెళ్ళగా కోర్టు కూడా వీరికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. కేంద్రం కూడా ఈ చర్య పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇటు కేంద్రం, అటు కోర్టులు ఒకేసారి జగన్కు షాకిచ్చాయని అంటున్నారు.
అసలేం జరిగిందంటే….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దికాలం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు డిస్కంలకు శాపంగా మారాయని పేర్కొన్నారు. మార్కెట్లో కారుచౌకగా విద్యుత్ లభిస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవటానికి ఐదేళ్ల క్రితం చేసుకున్న కొనుగోలు ఒప్పందాలే కారణం అని భావించింది. ‘2017 మార్చి 31తో పీపీఏల కాలపరిమితి ముగుస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం మార్చి 15న హడావుడిగా 41 పీపీఏలు కుదుర్చుకుంది. 15 రోజుల్లో పవన విద్యుత్తు ప్లాంట్లు స్థాపించి ఉత్పత్తి చేయడం సాధ్యమా?’ అని వైసీపీ నేతలు ప్రశ్నించారు.
కేంద్రం..కోర్టు కన్నెర్ర
రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్కు రూ.4.84 పడిందని, అదే థర్మల్ విద్యుత్తు యూనిట్ రూ.3లేనని దాంతో యూనిట్కు రూ.1.84 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వైసీపీ నేతలు తెలిపారు. థర్మల్ విద్యుత్తు వినియోగించకపోయినా ఫిక్స్డ్ చార్జీల కింద యూనిట్కు రూ.1.50 తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని తెలిపారు. 2014–15 నాటికి డిస్కంలు రూ.9 వేల కోట్ల నష్టాల్లో ఉండగా 2018–19 నాటికి రూ.29వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించింది. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది. అయితే, దీనిపై కోర్టుకు వెళ్లగా తాజాగా ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చింది. మరోవైపు కేంద్రం సైతం కన్నెర్ర చేసింది.
సుదీర్ఘ వివాదం
పవన, సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన పవర్ ప్రాజెక్టు అగ్రిమెంట్(పీపీఏ)ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి, పీపీఏలను రద్దు చేసిందంటూ విద్యుదుత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర సర్కారు మాటను తోసిరాజని పీపీఏల సమీక్షకు సిద్ధమైన ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ గత జూలై 1వ తేదీన జారీ చేసిన జీవో 63ను హైకోర్టు గత జూలై 25వ తేదీన నిలిపివేసింది. అదే నెల 12న ఏపీఎ్సపీడీసీఎల్ వివిధ విద్యుదుత్పత్తి సంస్థలకు రాసిన లేఖ అమలును కూడా 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలుకెళ్లినా ఉపశమనం లభించలేదు. బకాయిల చెల్లింపులోనూ తాత్సారాన్ని తప్పుబట్టింది. పీపీఏలో నిర్ణయించిన సౌరవిద్యుత్ యూనిట్ ధర పునఃసమీక్షపై తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టరాదని నవంబరు 28వ తేదీన ఆదేశించింది.