లక్నో(ఉత్తరప్రదేశ్), జనవరి 27: బులందశహర్ మూక హింసకు బలయిన పోలీస్ అధికారి సుభోద్ కుమార్ సింగ్ సెల్ఫోన్ను నిందితుడు ప్రశాంత్ నట్ ఇంట్లో శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడ మరో ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సుభోద్ కుమార్ సింగ్ సర్వీస్ రివాల్వర్ లాక్కొని ప్రశాంత్ నట్ ఆయనను కాల్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రశాంత్ నట్ను డిసెంబర్ 28న అరెస్టు చేశారు.
శనివారం రాత్రి అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా ఐదు సెల్ ఫోన్లు దొరికాయి. ఇంత వరకూ సుభోద్ కుమార్ సర్వీస్ రివాల్వర్ లభించలేదు. రివాల్వర్ కోసం సోదాలు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి అతుల్ శ్రీవాస్తవ్ తెలిపారు.
బులందశహర్లో మాహవ్ గ్రామంలో ఆవుల కళేబరాలు దొరికిన మీదట భజరంగ్ కార్యకర్తలు డిసెంబర్ మూడున పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు. 400 మందికి పైగా ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మూకలను అదుపు చేసేందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ సుభోద్ కుమార్ సింగ్ ను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఒక యువకుడు కూడా మృతి చెందాడు.
ఈ హింసలో పాలుపంచుకున్న మరొక వ్యక్తి కలువను జనవరి 1వ తేదీ అరెస్టు చేశారు.
ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహించిన భజరంగ్ దళ్ జిల్లా నాయకుడు యోగేష్ రాజ్ను జనవరి రెండవ తేదీ అరెస్టు చేశారు.
సంఘటన జరిగిన రెండు నెలల తరువాత నిందితుడి గృహంలో హత్యకు గురైన పోలీస్ అధికారి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.