మనం ఏ యుగంలో ఉన్నామో ఇంకా చాలా మందికి తెలిసి రావడం లేదు. ఆకాశంలోకి రాకెట్లు పంపిస్తూ.. రానున్న కాలంలో ఏం జరగనుందో సైన్స్ సాయంతో చెప్తున్న ఈ రోజుల్లో.. ఇంకా చేతి గీతలు, మంత్రాలు చింతకాయలు అంటూ చాలా మంది మూఢనమ్మకాల ఉచ్చులో చిక్కుకుని ఉన్నారు. వాళ్లు తీరు మారదు.. అలాగే ఉంటారు అని ఊరుకుంటే.. అమాయకుల ప్రాణాలు తీస్తూ.. ఎన్నో దారుణాలకు ఒడి కడుతున్నారు.
దీనిపై ఎంత మంది ఎన్ని చెప్పినా మేము మారమని మొండికేస్తూ.. కూర్చుంటున్నారు. వాళ్లను మార్చాలంటే ముందు వాళ్ల మానసిక స్థితిని మార్చాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు మళ్లీ జరిగి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక దగ్గర చేతబడి చేయించాడనే అనుమానంతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సజీవ దహనం చేస్తే.. ఇంకో చోట రైతును అత్య చేశారు. ఈ రెండింటికి కారణాలు ఒకటే.. చేతబడి అనే మూఢనమ్మకం.
జగిత్యాల జిల్లాలోని బల్వంతాపూర్ శివారులో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు రాచర్ల పవన్కుమార్(38)ను అతని బంధువులు సోమవారం రాత్రి సజీవ దహనం చేశారు. జగిత్యాలకు చెందిన విజయ్ తమ్ముడు జగన్ 12 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్కుమార్, భార్య కృష్ణవేణితో కలిసి సోమవారం సాయంత్రం జగిత్యాలకు వచ్చారు.
పవన్కుమార్ కావాలని తన భర్తను చేతబడి చేయించి చంపించాడనే అనుమానంతో అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత పవన్ కుమార్ ను ఒక గదిలో బంధించింది. అపై ఒంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టింది. దీంతో పవన్ కుమార్ భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింద. రంగంలోనికి దిగిన పోలీసులు ఆ గదిని తెరిచి చూసేసరికి పవన్ కుమార్ అప్పటికే పూర్తిగా కాలిపోయాడు. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దారుణానికి కారకులైన ఇద్దర్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇక కుమ్రం భీం జిల్లా తాటిమాదరానికి చెందిన రైతు ఆత్రం లచ్చు(40)కు పుర్కగూడ దగ్గర్లో కొంత పొలం ఉంది. ఆదివారం రాత్రి పంట కాపలా కోసం వెళ్లిన అతను సోమవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. పొలానికి వెళ్లి చూస్తే.. రక్తపుమడుగులో చనిపోయి ఉన్నాడని స్థానికులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఆత్రం అర్జు(56) కొన్ని రోజుల ముందు చనిపోయాడు. దీనకి కారణం లచ్చు కుటుంబం మంత్రాలు వేయడం వలనే అని ఆ కుటుంబ సభ్యలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అర్జు బంధువులే లచ్చును చంపేశారని అతని భార్య మైనుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.