కరోనా నేపథ్యంలో సినీనటుడు సోనూసూద్ చేసిన సేవల్ని యావత్ ప్రపంచం కొనియాడింది.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. రీల్ విలన్ కాస్త రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. అయితే తాజాగా ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థతో కలిసి సోనూసూద్ ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రాంను రూపొందించాడు.
వైద్యవిద్య అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందులోనూ విదేశీ వైద్యవిద్య అంటే పేద, మధ్యతరగతి వారికి అందని మామిడి పండే ..! అయితే ఇప్పుడు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఉపకార వేతనాలను అందించటానికి ముందుకొచ్చారు.. ! ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థతో కలిసి ఆయన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
ముఖ్యంగా కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, తజకిస్తాన్లలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కిర్గిస్తాన్లో ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (ఐఎస్ఎం- ఐయూకే), కజకిస్తాన్లో కజక్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీ, జార్జియాలో ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, ఇంకా మరో ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి . దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు వారు ఎంచుకున్న విశ్వవిద్యాలయాల్లో చేరవచ్చు. విద్యార్థులు చదివేందుకు రూ. 5 లక్షల రూపాయిల స్కాలర్షిప్లు అందజేస్తామని ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ ఫణిభూషణ్ వివరించారు.
వెబ్ సైట్ : https://sonuism.org/
చివరితేది :15/12/2020.