కరోనా సమయంలో అలాంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. అది ఆరోగ్యం మీద శ్రద్ధ అనుకోవాలా… లేక హమ్మయ్య పరీక్షలు రాయాల్సిన పనిలేదని అధికారికంగా ఎగ్గొట్టేసిన ఆనందంలో భాగమో తెలియదు కానీ… ఏపీలో పిల్లలంతా కేక్ కటింగ్ లు చేసి సంబరాలు చేసుకున్నారు. ఉత్తమ విద్యార్థులుగా మారినందుకు కాదు సుమా… పదో తరగతై పరీక్షలు రాయాల్సిన ఇంటర్మీడియట్ లోకి వెళ్లిపోయినందుకు! అవును… పదోతరగతి పరీక్షల రద్దుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది! కరోనా సమయంలో పిల్లల ఆరోగ్యానికి తమ ప్రథమ ప్రాధాన్యం అని తెలిపింది.
వివరాళ్లోకి వెళ్తే… పదో తరగతి పరీక్షల రద్దుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ టెన్త్ పరీక్షలను నిర్వహించాలని పరీక్షల తేదీలను ప్రకటించిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్.. పెరుగుతున్న వైరస్ ప్రభావంవల్ల.. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ఆలోచన లేదని పరోక్షంగా చెబుతూ… పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల లాక్ డౌన్ విధిస్తూ ఉండటం.. కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచించడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాలపై స్పందించిన మంత్రి సురేష్… అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, నాటిలా నేటి పరిస్థితులు లేని కారణంగా, కరోనా వ్యాప్తి పెరుగుతున్న సందర్భంగా రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు! తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రాగానే… ఏపీలో విద్యార్థులు కొంతమంది రోడ్లపైకి వచ్చి “థ్యాంక్యూ జగన్ అంకుల్” అంటూ కేకలు వేస్తూ కేక్ లు కట్ చేసి, సంబరాలు చేసుకోవడం కొసమెరుపు!