పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) కన్నుమూశారు. కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో కడ్తాల్ లోని కైలాశపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. రేపు (సోమవారం) సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ఏపి, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు హజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భోదన్ లో జన్మించిన సుభాష్ పత్రిజీ గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగిగా పని చేశారు. 2012 లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో కైలాసపరి మహేశ్వ ర మహా పిరమిడ్ నిర్మించారు. అదే సంవత్సరం డిసెంబర్ 18 నుండి జనవరి 31 వరకూ ప్రపంచ ధ్యాన మహాసభలను నిర్వహించారు. ఏపి, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు ఉన్నారు.