మనం మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడుకోవాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురవుతుంటాం. అలాంటప్పుడు హాస్పిటళ్లలో చేరి రూ.లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అయితే దాన్ని నివారించేందుకు మనకు ప్రస్తుతం అనేక కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ను అందిస్తున్నాయి. భిన్న రకాల ప్రీమియంలను చెల్లిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కు నిర్దిష్టమైన మొత్తాలను క్లెయిమ్లుగా అందిస్తారు. అందులో భాగంగానే పలు కంపెనీలు ప్రస్తుతం భిన్న రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. అయితే ఏ కంపెనీకి చెందిన హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకునే ముందైనా.. కింద తెలిపిన విషయాలను మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి.
1. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఆదాయ పన్ను కడుతుంటే అందుకు కొంత వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే ప్రీమియాన్ని నగదుగా కాకుండా చెక్, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర డిజిటల్ పద్ధతిలో చెల్లించాలి. దీంతో రూ.5వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
2. కొందరికి డయాబెటిస్, గుండె జబ్బులు, బీపీ తదితర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయితే అలాంటి వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆయా సమస్యలకు చికిత్స తీసుకునేందుకు ఇన్సూరెన్స్కు గాను 36 నుంచి 48 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం తరువాత ఆయా సమస్యలకు కూడా ఇన్సూరెన్స్ కింద వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీని బట్టి మారుతుంది. కొన్ని కంపెనీలు 2 ఏళ్ల వరకు మాత్రమే వెయిటింగ్ పీరియడ్ను అందిస్తున్నాయి.
3. హెల్త్ ఇన్సూరెన్స్ను తీసుకునే ముందు అందులో లభించే అన్ని సౌకర్యాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే ఇన్సూరెన్స్ పొందే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు తీసుకునే ఇన్సూరెన్స్కు ఎన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ కంపెనీ క్లెయిమ్లను ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది, ఇన్సూరెన్స్కు క్లెయిమ్ చేసుకుంటే ఎంత త్వరగా వస్తుంది, అందులో ఏమేం సౌకర్యాలు ఉంటాయి.. తదితర అన్ని వివరాలను ముందుగానే తెలుసుకుని.. తరువాత ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి కూడా ఫలితం ఉండదు. డబ్బులను మీ జేబులోంచి చెల్లించాల్సి వస్తుంది.
4. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక 3 నుంచి 4 ఏళ్ల వరకు ఎలాంటి క్లెయిమ్లు చేయకపోతే పలు కంపెనీలు ఉచిత బాడీ చెకప్ను అందిస్తాయి. ఆ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 1 శాతం ఖర్చును కంపెనీలు ఫుల్ బాడీ చెకప్కు కేటాయిస్తాయి. ఆ మొత్తానికి గాను ఆదాయపు పన్ను సెక్షన్ 80డి ప్రకారం మినహాయింపు పొందవచ్చు. కనీసం రూ.5వేల నుంచి గరిష్టంగా రూ.50వేల వరకు ఈ పద్ధతిలో పన్ను మినహాయంపు పొందవచ్చు.
5. సాధారణంగా కంపెనీలు 45 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉండే వారికే అన్ని టెస్టులు చేసి ఆ రిపోర్డులకు అనుగుణంగా హెల్త్ ఇన్సూరెన్స్ను అందిస్తుంటాయి. అయితే కొన్ని కంపెనీలు 45 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టెస్టులు చేయిస్తాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు ఈ టెస్టులను చేయడం లేదు. ఎందుకంటే ఆ టెస్టులకు గాను ఆ కంపెనీలే ఖర్చులను భరించాల్సి వస్తోంది. అందుకని వాటిని కంపెనీలు చేయించడం లేదు. అయితే ఇన్సూరెన్స్ తీసుకునే వారు అన్ని టెస్టులను తమ ఖర్చులతో చేయించుకుని ఆ రిపోర్టులను కంపెనీలకు ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పక్కాగా ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీలు పెట్టే లిటిగేషన్ల నుంచి తప్పించుకోవచ్చు.