ఆంధ్రప్రదేశ్ లోని ఓ రైతుకు తెలంగాణ సీఎం కేసిఆర్ నుండి అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది. ప్రగతి భవన్ కు విందుకు రావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు. దీంతో ఆ రైతు ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. కెసిఆర్ ఆ రైతుకు ఎందుకు ఫోన్ చేశారు? ఏమి మాట్లాడారు? విందుకు ఎందుకు ఆహ్వానించారు? అనేది అందరికీ ఉత్సాహం కలుగుతుంది.
స్వతహాగా తెలంగాణ సీఎం కేసిఆర్ కు అధునిక వ్యవసాయ పద్దతులు అంటే మక్కువ ఎక్కువ. కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంకు చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేసిఆర్ నేరుగా ప్రసాదరావుకు ఫోన్ చేసి దాదాపు పది నిమిషాల సేపు మాట్లాడారు. ప్రసాదరావు వ్యవసాయంలో అనుసరిస్తున్న పద్ధతులను కెసిఆర్ అడిగి తెలుసుకోవడంతో పాటు రెండు రోజుల్లో కారు పంపుతానని, విందుకు రావాలని ఆహ్వానించారు. ప్రసాదరావు వ్యవసాయంలో అనుసరిస్తున్న పద్ధతులను తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనతో కెసిఆర్ ఆయనను స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ప్రసాదరావు తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాను సాగుచేసే పద్ధతులను కెసిఆర్ కు వివరించానన్నారు. వ్యవసాయంతో పాటు 250 గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ల పెంపకం చేస్తున్నాననీ, దీని వల్ల పొలానికి మంచి సేంద్రీయ ఎరువు అంది భూమి సారవంతమై దిగుబడులు పెరుగుతున్నాయని వివరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి సాగు అనుభవాలు తెలుసుకోవడంతో పాటు విందుకు ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ప్రసాదరావు పేర్కొన్నారు. వరిలో వేద సాగు పద్ధతుల వల్ల ఖర్చు తగ్గడమే కాక దిగుబడులు పెరుగుతాయని రైతులు గుర్తించాలని ప్రసాదరావు అన్నారు.