(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలజగడం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనబడటం లేదు. నీటి వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలంగా ఉన్నారని ఒక పక్క కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎపెక్స్ కమిటీ సమావేశం అనంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందేనని ఒక వేళ దాని నిర్మాణం ఆపకపోతే అలంపూర్ పెద్దమరూర్ దగ్గర బ్యారేజీ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు కెసిఆర్. అక్కడ బ్యారేజీ నిర్మించి రోజుకు మూడు టీఎంసిల నీటిని ఎత్తిపోయడం ఖాయమన్నారు. నదీ జలాల విషయంలో ఏపి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరని కెసిఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపి వ్యవహరిస్తే ఇకపై కుదరని పేర్కొన్నారు కెసిఆర్. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే సహించేది లేదనీ, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు కెసిఆర్.