తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సహా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబందించిన పలు సమస్యలు, ఎయిర్ పోర్ట్ లు, విభజన చట్టంలోని అంశాలు, వరద సాయం తదితర అంశాలపై చర్చించి వినతి పత్రాలు సమర్పించారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేసీఆర్ తో సహా తెలంగాణ మంత్రులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం విదితమే. కేంద్రంపై తీవ్ర స్థాయి విమర్శలు చేసి పట్టు మని పది రోజులు కాకముందే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసే ప్రయత్నం చేయడం, కేంద్ర మంత్రులను కలవడంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ కాళ్ల బేరం
కేసీఆర్ కేంద్రంతో కాళ్ల బేరం చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీ విమర్శించారు. అధికారులు లేకుండా కేసీఆర్ ఒక్కరే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలవడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ కలసి కాంగ్రెస్ ను దొంగ దెబ్బ కొట్టె కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ మేయర్ పదవిని కేసీఆర్ బీజేపీకి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు.
రహస్య ఎజెండా బయట పెట్టాలి
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో రహస్య ఎజెండా ఉందని మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదేమిటో బయట పెట్టాలన్నారు. కేసీఆర్ కు రైతులపై చిత్త శుద్ధి ఉంటే ఢిల్లీలో రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. మోడీని వ్యతిరేకించే వారిపై సిబిఐ, ఈడీ దాడులు జరిగాయని కానీ ఇంత వరకు ఒక్క కేసీఆర్ మీద దాడులు జరగలేదనీ అన్నారు పొన్నం. ఇప్పుడు కేసులకు భయపడే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని పొన్నం ఆరోపించారు. కేసీఆర్ ఏమి రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేత చిన్నా రెడ్డి ప్రశ్నించగా, బీజేపీ, టీఆరెస్ తోడుదొంగలని ఎంఎల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.