జల వివాదాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ కావాలనా నిర్ణయించుకున్నారు. కానీ.. ఈ భేటీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జల వివాదాలపై ఎటువంటి చర్చలు లేకుండానే చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసిన విషయం విధితమే.
ఈ ప్రాజెక్టు ఆపాలంటూ గతంలో టీఎస్ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు తెలంగాణలో గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధంగా రెండు రాష్ట్రాలు ఒకొరికొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో కేంద్రం ఈ సమస్యపై స్పందించింది. ఏ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని భావించింది. అయితే ఈ భేటీకి హాజరుకాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
వచ్చే నెలాఖరున.. లేదా సెప్టెంబర్ లో చూద్దాం..
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై మాట్లాడారు. ప్రస్తుతానికి ఈ విషయంపై కృష్ణా రివర్ బోర్డు స్పందించడంతో ఇప్పట్లో భేటీ అవసరం లేదని అన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలనే విషయంపై కూడా మాట్లాడారు. దీంతో తెలంగాణకు వచ్చిన ఇబ్బంది లేదంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5న హాజరు కాలేమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి తెలంగాణ అధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ అంశంపై కేసీఆర్ అంతగా ఆసక్తి చూపకపోవడంతోనే భేటీ రద్దయిందని తెలుస్తోంది. ఆగష్టు 20న లేదా సెప్టెంబరులో భేటీ నిర్వహణ ఉండొచ్చని తెలుస్తోంది.