ముఖ్యమంత్రి జగన్ ముత్యమే కావచ్చు కానీ కొందరు వైసీపీ శాసనసభ్యులు అలా లేరన్నది సత్యం.ఏపీలో విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ కొలువులను ఎమ్మెల్యేలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిరుద్యోగుల నుంచి రూ.200 కోట్ల వసూళ్లు జరిగినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.సిఎం జగన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా, నియామకాలను నిలిపివేసినా శాసనసభ్యులు వెనక్కు తగ్గడం లేదు.ఉన్న వాళ్లను సైతం తీసేసి తమకు డబ్బులిచ్చిన వారిని ఆ ఉద్యోగాల్లో నియమించిన వ్యవహారం నెల్లూరు జిల్లాలో జరగడంతో విషయం రచ్చకెక్కింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పడ్డాయి. దాదాపు 12000 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
అయితే పర్మినెంట్ అవుతుందని.. జీతం బాగుంటుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతామని తెలిసి నిరుద్యోగులు ఎగబడడంతో కొందరు ఎమ్మెల్యేలు దీన్ని క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కొలువును రూ.10లక్షలకు అమ్ముకున్నారని.. 5వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని అంటున్నారు. మొత్తం రూ.200 కోట్ల వరకు ఈ వసూళ్లు జరిగాయనే ప్రచారం కలకలం రేపుతోంది.
నిజానికి ఏపీ సీఎం జగన్ ఇలాంటి కాంట్రాక్ట్ పోస్టుల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు ఇప్పటికే హెచ్చరికలు పంపారు. మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులకు సూచించారు. అయినా కూడా జగన్ మాటలను కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టినట్టు ప్రచారం సాగుతోంది.ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు 10లక్షల చొప్పున రూ.200కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. ఈ విషయం సీఎం జగన్ కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని అప్పట్లో ఆదేశించారు.
అయినా ఒక్కో నిరుద్యోగి నుంచి వసూలు చేసిన రూ.10లక్షలను శాసనసభ్యులు తిరిగి ఇవ్వలేదని సమాచారం. పోస్టులు భర్తీ చేస్తామంటూ డబ్బులు తీసుకున్న వారిని ఏమారుస్తున్నారని వినికిడి.ఈనేపథ్యంలో నిరుద్యోగుల నుంచి సదరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడంతో వారు అధికారుల మెడపై కత్తులు పెట్టి తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.నెల్లూరు జిల్లాలో ప్రస్తుతమున్న పదిహేను మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించి ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని నియమించడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు రోడ్డెక్కి ఆందోళన చేయటంతో ఈ ఆమ్యామ్యాల వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది.అవినీతిని సహించేది లేదంటున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.