5 states elections: 5 రాష్ట్రాల ఎన్నికలు 5 states elections: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒపీనియన్ పోల్స్, సర్వేలు సిద్ధంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, రాష్ట్రాల్లోని పరిస్థితులను బేరీజు చేసుకుని అనేక సంస్థలు ఎన్నికల ఫలితాలపై ముందస్తు అభిప్రాయాలు వెల్లడిస్తాయి. అలాంటి సంస్థల్లో టైమ్స్ నౌ సర్వే ఒకటి. ప్రస్తుతం దేశంలో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలపై ఈ సంస్థ చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెల్లడించింది.
బీజేపీకి అసోం, పుదుచ్చేరి ప్రాంతాల్లో అధికారం దక్కుతుందని తేల్చింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో ఉన్న పొత్తు వారికి కలిసిరాదని తేల్చింది. కేరళలో లెఫ్ట్ పార్టీలను ఎదుర్కోవడం బీజేపీకి సాధ్యమయ్యేది కాదని వెల్లడించింది. ఇక బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రాభవం ముందు బీజేపీ నిలబడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అక్కడ పార్టీల మధ్య పోటీ కంటే.. వ్యక్తులుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యే యుద్ధం జరుగుతోంది.
బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లకు తృణమూల్ కాంగ్రెస్ కు 152 నుంచి 168, బీజేపీకి 104 నుంచి 120, కాంగ్రెస్ కు 18 నుంచి 26 మధ్య సీట్లు వస్తాయని అంచనా.
తమిళనాడులో 234 స్థానాలకు డీఎంకే-కాంగ్రెస్ కూటమి 46 శాతం ఓట్లతో 175 సీట్ల సాధించి అధికారం దక్కించుకుంటుందని.. అన్నాడీఎంకే-బీజేపీకి 35 శాతం సీట్లతో 40 నుంచి 45 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. కమల్ హాసన్ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తేల్చింది.
కేరళలో వామపక్ష ప్రాబల్యం ఎక్కువ. ఈసారి కూడా అక్కడ వామపక్షాలకే అధికారం అంటోంది సర్వే. ఎల్డీఎఫ్ కూటమికి 77 సీట్లు రావొచ్చని.. కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమికి 62 స్థానాల వరకూ రావొచ్చని అంచనా వేసింది. మొత్తం 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో బీజేపీ ప్రభావం తక్కువే అని అంచనా వేసింది.
అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేల్చింది. దాదాపు 75 సీట్లతో ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేసింది. మహాజోత్ కూటమికి దాదాపు 60 సీట్లు వస్తాయని అంటోంది.
పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీఏ దాదాపు 25 సీట్లు, కాంగ్రెస్-డీఎంకే కూటమికి దాదాపు 10 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది.