లక్నో: అధికారిక సమావేశంలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు చెప్పులతో దాడి చేసి కొట్టుకున్నారు. ప్రోటోకాల్ వివాదంపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్టం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో చోటుచేసుకుంది.
శంకుస్థాపన శిలా ఫలకంపై తలెత్తిన వివాదం చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లింది. సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి బిజెపి ఎంపి శరద్ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేశ్ సింగ్లు హాజరయ్యారు. శంకుస్థాపన శిలా ఫలకంపై పేర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపి, ఎమ్మెల్యేల మధ్య వివాదం ప్రారంభమైంది.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఆగ్రహావేశాలతో చెప్పులతో కొట్టుకుని పిడిగుద్దులు కురిపించుకునే వరకూ వెళ్లింది. అక్కడ ఉన్న నాయకులు, అధికారులు కూడా వారిని శాంతింప చేయలేకపోయారు. పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి ఇద్దరినీ శాంతింపజేశారు. ఎంపిపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే రాకేష్ సింగ్ మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు.
ఈ ఘటనపై యూపి బిజెపి సీరియస్ అయింది. ఇద్దరు నేతలపై శాఖాపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎంఎన్ పాండే ఎఎన్ఐ న్యూస్ ఎజన్సీకి వెల్లడించారు.
అధికార బిజెపి ప్రజా ప్రతినిధుల ఈ చర్యలను ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
శరద్ త్రిపాఠి శాంత్కబీర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాకేష్ సింగ్ మెంద్వాల్ విధాన్ సభ సభ్యుడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ స్థాపించిన హిందూ యువ వాహిని సంస్థలో రాకేష్ సింగ్ సభ్యుడు.
వీడియో రైట్ మిడియా సౌజన్యంతో….వీడియో కోసం కింద క్లిక్ చేయండి