అమరావతి విషయంలో నిన్న మొన్నటి వరకు చంద్రబాబు బాటలోనే నడిచిన విశాఖ తూర్పు టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తాజాగా యూటర్న్ తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పార్టీ అన్నా, చంద్రబాబు నాయకత్వం అన్నా కళ్లు మూసుకుని జైకొట్టే వెలగపూడికి పార్టీలో మంచి పేరుంది. 2009 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధించారు. టిడిపికి ఉన్న అతి బలమైన నాయకుల్లో ఒకరైన వెలగపూడి రామకృష్ణబాబు విశాఖను రాజధాని చేసే విషయంలో మాత్రం చంద్రబాబు బాటనే అనుసరించారు.విశాఖ లోని మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో గోడ మీద పిల్లి వాటం గా వ్యవహరించగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నది విశాఖపట్నంలో అయినప్పటికీ ఆ విషయాన్ని కూడా పక్కనపెట్టి అమరావతికి వెలగపూడి జై కొట్టారు. అయితే ఈ విషయంలో విశాఖ ప్రజల నుండి ఆయనకు ప్రతికూలత వ్యక్తం అవుతున్న సూచనలు కనిపించాయి. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. మూడు రాజధానులు బిల్లు ఆమోదానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి టిడిపి పిలుపు ఇచ్చినప్పటికీ వెలగపూడి పట్టించుకోలేదు.ఇంటి నుంచి బయటకే రాలేదు.అమరావతి కి అనుకూలంగా తాను ఆందోళన చేస్తే విశాఖ ప్రజల్లో తనొక్కడే విలన్ అవుతారని, మిగిలిననాయకులు అందరూ హీరోలుగా మారతారని కూడా వెలగపూడి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అంటే.. దాదాపు విశాఖను పాలన రాజధాని చేసినందుకు ఆయన సంతోషిస్తున్నారనే అంటున్నారు అనుచరులు.
ఏదేమైనా యూటర్న్ తీసుకోవటంలో మాస్టర్ అయిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రియశిష్యుడైన వెలగపూడి రామకృష్ణ బాబు తన గురువు నుండి యూటర్న్ తీసుకోవడం ఎలాగా అన్న విషయమై కూడా తర్ఫీదు పొందారని సెటైర్లు పడుతున్నాయి.