ఈరోజు ఉదయం 9 గంటలకు మొదలైన రాజ్యసభ ఎన్నికలు సాయంత్రం నాలుగు గంటలకు ముగిశాయి. 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగగా 6 గంటలకు విజేతలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మరియు పరిమల్ నత్వాని రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారి పార్టీ దళిత నాయకుడు అయిన వర్ల రామయ్య ను బరిలోకి దించింది. దాంతో అందరూ ఓడిపోయే సీట్ కాబట్టి దళితుడిని బలిపశువును చేశారని చంద్రబాబు ని విమర్శించడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయమై వర్ల రామయ్య స్పందించిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ చేస్తున్న కులపూరిత రాజకీయాలను ఎండగట్టాలని ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానం తనని పోటీలోకి ఉంటుందని అన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లలో ఇద్దరు క్రిమినల్స్ (A4, A6) అయిన మోపిదేవి వెంకటరమణ మరియు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కు సీట్లు అప్పగించేందుకు వైసిపి ప్రభుత్వం మొగ్గు చూపిందే కానీ ఒక దళితుడిని కూడా ఆ సీటు కోసం పరిగణించలేదు అని ఆయన విమర్శించారు.
పైగా గత ఎన్నికల్లో దళితుల ఓట్లు అన్నీ తనవైపు తిప్పుకొని గెలిచిన సీఎం మొత్తం తన గుప్పిట్లో ఉన్న ఆరు రాజ్యసభ సీట్లలో ఒకటి కూడా వారికి కేటాయించకపోవడంతోనే చంద్రబాబు తనని పోటీలోకి దింపినట్లు వర్ల రామయ్య తెలిపారు. ఇక బాబు తనని బలిపశువు చేసాడు అన్న వాదన పై స్పందించిన రామయ్య నిజంగా తమ అధినేత అటువంటి ఉద్దేశంతోనే తనను నిలబెట్టి ఉంటే దానిని పసిగట్టలేనంత లేదా అతనితో వాదించలేని చేతగాని వాడిని అయితే తాను కాదని అన్నారు. అంతా చర్చించుకున్న తర్వాతే తన ఇష్ట ప్రకారమే పోటీలో దిగినట్లు వర్ల రామయ్య తెలిపారు.