పశ్చిమ బెంగాల్… ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉనికి లేని రాష్ట్రం. కమ్యూనిస్టులు బలమైన కోట. నక్సల్ ఉద్యమం పుట్టిన నేల. జ్యోతి బసు లాంటి కమ్యూనిస్టు ఉద్దండులు కొన్ని దశాబ్దాల పాటు పాలించిన ప్రాంతం. తూర్పు భారతదేశంలో కీలకమైన రాష్ట్రం. వచ్చే ఏడాది వేసవిలో ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కీలకమైన మార్పులు జరగబోతున్నాయి.
ఉనికే లేని బీజేపీ పార్టీ ఇప్పుడు కమ్యూనిస్టులను తోసిరాజని ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈసారి మమతా దీదీ ను ఎలాగైనా దెబ్బతీసి కీలకమైన పశ్చిమబెంగాల్లో సొంతం చేసుకోవాలని కమలనాథుల గట్టి ప్రయత్నం. దీనిలో భాగంగానే ఢిల్లీ పెద్దలు అమలుచేస్తున్న వ్యూహాలు దానికి ప్రతివ్యూహాలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న సమయంలో అతని కాన్వాయ్పై కొందరు దాడి చేయడం, అది జాతీయ స్థాయిలో ప్రచారం పొందడం సైతం ఇది బిజెపికి స్కెచ్ గానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక అధికార పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుడు పై దాడి జరగడం, అది తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్లో జరగడం దీన్ని జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించుకోవడం తద్వారా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బిజెపి సింపతి ఓట్ల పొందేందుకు ప్రయత్నమని, దీంతో పాటు దేశవ్యాప్తంగా ఒక హైప్ తెచ్చే వ్యూహంగా తెలుస్తోంది.
గెలుపు సాధ్యమా??
పశ్చిమబెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం అచ్చం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పోలి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న మమతాబెనర్జీ రెండోసారి అధికారాన్ని ఏలుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ప్రతి సారి రాజకీయ మార్పులు ఉండవు. అధికారంలోకి వచ్చిన వారు కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మమతా బెనర్జీ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఇక్కడ గెలిచి తన ఉనికిని చాటి తేనే ఢిల్లీ స్థాయి రాజకీయాల్లోనూ ఆమె చక్రం తిప్పగలుగుతారు. దీంతో కచ్చితంగా బెంగాల్ గెలుపుకోసం వీధి అన్ని ప్రయత్నాలు చేస్తారు.
** బెంగాల్ రాజకీయాల్లో హింస కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నక్సల్స్ ఉద్యమం పుట్టింది నక్సల్బరీ పశ్చిమబెంగాల్లోనే.. తర్వాత తర్వాత రాష్ట్రం మొత్తం కమ్యూనిస్టులు విస్తరించారు. కొన్నేళ్లపాటు అప్రతిహతంగా పాలించారు. ఈ సమయంలోనే రాజకీయ శత్రువుల పై దాడులు పెరిగాయి. వీరి రౌడీయిజాన్ని దౌర్జన్యాలను ఎదుర్కోలేక ప్రత్యామ్నాయం గురించి చూస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వారికి ఒక ఆశా దీపం లా కనిపించింది. 1998 లో పార్టీ స్థాపించి… వెంటనే వచ్చిన లోకసభ ఎన్నికల్లో 8 సీట్లు సాధించి ఓ మహిళా నాయకత్వం పట్ల బెంగాలీలు మక్కువ చూపారు. 2006 లో కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్లో మొదలైన నందిగ్రామ్ ఉద్యమం తృణముల్ కాంగ్రెస్ కు మంచి పేరు తేవడమే కాక అధికారాన్ని చేరువ చేసింది. 2001 ఎన్నికల్లో 260 సీట్లకు పోటీపడిన మమతా 60 సీట్లను సాధిస్తే, 2006 ఎన్నికల్లో మరోసారి కమ్యూనిస్టుల బలంతో దీని తలపడి లేకపోయింది. 2006లో మొత్తం 257 సీట్లకు పోటీ చేసిన తృణముల్ పార్టీ కేవలం 30 సీట్లను సాధించి ఉనికికే ఎసరు తెచ్చుకుంది. పట్టు వదలకుండా పశ్చిమబెంగాల్ పై తన మార్కు రాజకీయం తో కమ్యూనిస్టుల పార్టీని ముప్పుతిప్పలు పెట్టిన మమతా బెనర్జీ 2011 ఎన్నికల్లో 226 సీట్లకు పోటీ చేసి 186 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. 2016లో 211 సీట్లు సాధించి తన బలం నిరూపించుకుంది. ఇలా ప్రతి ఎన్నికల్లో మమతా బెనర్జీ దూసుకుపోవడం తప్ప, వెనకడుగు వేసే పరిస్థితి పశ్చిమబెంగాల్లో లేదు. అయితే కమ్యూనిస్టుల ప్రభావం పశ్చిమబెంగాల్ లో బలంగా తగ్గడం… అదే రీతిలో ఉనికిలో లేని బీజేపీ బలం పూర్తిగా పెరగడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
అంత వీజి కాదు
పశ్చిమ బెంగాల్ లో రాజకీయం నాలుగు స్తంభాలాట.. తృణముల్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ బిజెపి అక్కడ విజయం కోసం పోరాడుతాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని 42 లోక్సభ సీట్లకు బిజెపి ఏకంగా 18 సీట్లను, 40.05 శాతం ఓట్లను గెలుచుకుంది. ఇంత పుంజుకోవడం గతంలో ఎప్పుడూ లేదు.లోక్సభ ఫలితాలు విశ్లేషించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకో బడే స్థానాల్లో గుర్తిస్తే అవి 125 అవుతాయి. దీనికి తగ్గట్టుగానే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తన రాజకీయ వేడిని పెంచింది. బిజెపికి చెందిన మహారాష్ట్ర నాయకుడు సునీల్ దేవధర్, హర్యానాకు చెందిన దృశ్యనంత గౌతమ్, మహారాష్ట్ర కే చెందిన మరో నేత వినోద్ తవడే, ఉత్తరప్రదేశ్ కు చెందిన హరీష్ త్రివేది, వినోద్ సొంకర్ లకు పశ్చిమ బెంగాల్ లోని జిల్లాలను ఐదు విభాగాలుగా చేసి వీరికి బాధ్యతలు అప్పగించింది. స్థానిక నాయకులతో వీరు సమన్వయం చేసుకొని స్వీట్ల పంపిణీ దగ్గర్నుంచి గెలుపు వ్యూహాలు వరకు మీరు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికే ఈ ఐదుగురు నేతలు పశ్చిమ బెంగాల్ లో తిష్ట వేసి తమకు అప్పగించిన బాధ్యతల్లో క్రమంగా ముందుకు సాగుతున్నారు. 294 నియోజకవర్గాల్లో ఏ ఏ నియోజకవర్గంలో ఎలాంటి బలం ఉంది ఎలాంటి నేతలను పోటీకి నిలపాలి..?? గెలుపునకు స్థానిక నేతల సహకారం ఎలా వారిని ఎలా తమ వైపు తిప్పుకోవాలని అనే విషయాలను వీరు ఎప్పటికప్పుడు ఢిల్లీ నాయకుల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. వీరిని సమన్వయం చేసేందుకు భాజపా ఐటీ సెల్ చూసే మాలవ్యా కు బాధ్యతలు అప్పగించారు. బిజెపి వ్యూహాలకు తగ్గట్టుగానే మమతా బెనర్జీ సైతం వడివడిగా అడుగులు వేస్తున్నారు. బెంగాల్లో ఎప్పుడూ ఎవరు వస్తున్నారు ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అనేది ఆమె నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. బెనర్జీ ప్రధాన బలం ముస్లింలు.. వారి ఓటింగ్ శాతం పశ్చిమబెంగాల్లో అధికం. వీరితో పాటు బీసీలను ఇతర వర్గాలను కలుపుకుంటే మమతా బెనర్జీ గెలుపు సులభమే అయినా… బీజేపీ ఈసారి కచ్చితంగా బెంగాల్లో జండా పాతడానికి అన్ని వైపుల నుంచి రంగం సిద్ధం చేస్తోంది. మమత ఎత్తులకు బిజెపి పైఎత్తులు బిజెపి ఎత్తులకు మమతా దీదీ పై ఎత్తులు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నాయి.